బాబు దూకుడు: తమ్ముళ్లలో తర్జన భర్జన
బాబు కొత్త వ్యూహం రాజకీయ ప్రత్యర్థులను ఆలోచనలో పడవేస్తుంటే సొంత పార్టీ నేతల్లో ఉత్సాహం నింపుతోంది. అదే సమయంలో అన్ని విషయాల్లో ఇంత దూకుడు పనికి రాదని, తెలంగాణ వంటి అంశాల్లో కొంత సర్దుబాటుతో వెళ్లకపోతే దెబ్బ తింటామని పార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో బాబు స్పీడుకు కొంత కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి బాబు దూకుడు ఆయన పార్టీకి కొత్త మిత్రులను సంపాదించి పెట్టడంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సందడి పెంచుతోంది.
సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో చవి చూసిన చేదు ఫలితాలు టిడిపిని ఒక కుదుపు కుదిపాయి. రాజకీయంగా దూకుడు వైఖరితో వెళ్లకపోతే శాశ్వతంగా వెనకబడి పోవాల్సి వస్తుందని, అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నిర్ణయించుకొన్నారు. ఆ దృష్టితోనే పార్టీ తరపున బిసి డిక్లరేషన్ విడుదల చేసి బిసిలకు వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తామని ప్రకటించారు. పోయిన ఎన్నికల్లో ఆ పార్టీ బిసిలకు 65 సీట్లు ఇచ్చింది. పొత్తులతో కొన్ని సీట్లు పోవడంతో బిసిలకు ఇచ్చిన సీట్లు తగ్గాయి.
అయినా ఒకేసారి ఆ వర్గానికి వంద సీట్లు ఇవ్వడం సాధ్యమేనా అన్న ప్రశ్న పార్టీ నేతలు కొందరిలో లోలోపల ఉన్నా చంద్రబాబు మాత్రం ఈసారి తప్పదని తేల్చిచెబుతున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా కొత్త ఇన్చార్జిని పెట్టాల్సి వచ్చినా ఆ స్థానంలో బీసీ నేతను అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లా నూజివీడు టిడిపి ఎమ్మెల్యే పార్టీకి దూరం కాగానే అక్కడ బిసి నేతను అన్వేషించాలని ఆయన ఆ జిల్లా పార్టీని ఆదేశించారు. సరైన అభ్యర్థులు దొరక్క నాలుగైదు సీట్లలో ఓటమి చవి చూడాల్సి వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వంద సీట్లు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని ఆయన పార్టీ నేతల వద్ద స్పష్టం చేస్తున్నారు.
ఊరికే డిక్లరేషన్ ఇచ్చి వదిలివేయకుండా ఇందులోని అంశాలు ఆయా వర్గాల్లోకి వెళ్లే నిమిత్తం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ బిసి కులాల నేతలతో సమావేశాలు నిర్వహించి తానెంత పట్టుదలగా ఉందీ వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఆయన అంతే పట్టుదలతో వ్యవహరించారు. ఎస్సీల్లోని రెండు ఉప కులాలు మాల, మాదిగ మధ్య తలెత్తిన వివాదంతో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అంశంలో ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడానికి సాహసించడం లేదు. టిడిపి కూడా చాలాకాలం ఈ అంశంలో తటస్థ వైఖరితో వ్యవహరించింది. ఇద్దరిలో ఎవరినీ వదులుకోరాదన్న భావన దీనికి కారణం.
కాని మారిన రాజకీయ పరిస్థితుల్లో బాబు ఆ అస్పష్టతను అధిగమించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు అధికారికంగా పొలిట్బ్యూరో సమావేశంలో తీర్మానం చేసి ప్రకటించారు. దీనికి ముందు పార్టీలోని మాల నేతలను ఒకటికి రెండుసార్లు పిలిపించి నచ్చజెప్పి పార్టీలో వరకూ నిరసన గళం పెద్దగా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నిర్ణయాలు టీడీపీకి కొత్త మిత్రులను సంపాదించి పెట్టాయి. చాలా ఏళ్ల తర్వాత బీసీ సంఘం నేత కృష్ణయ్య, మాదిగ ఉద్యమ నేత మంద కృష్ణ వంటివారు ఎన్టీఆర్ భవన్లో అడుగు పెట్టి బాబుకు అభినందనలు తెలిపారు.
ఇదే ఊపుతో తెలంగాణ అంశంలో కూడా పార్టీ వైఖరిని తేల్చివేయాలని చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణకు అనుకూలంగా గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ కేంద్రానికి లేఖ పంపాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి వైఖరి సాహసంతో కూడిందే అయినా వెనకడుగు వేయరాదన్న అభిప్రాయంలో ఉన్నారు. బాబు వైఖరి తెలంగాణ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. లేఖ ఇస్తే తమ ప్రాంతంలో పార్టీకి పునర్జీవం తేగలమని వారు భావిస్తున్నారు.
కాని మిగిలిన నిర్ణయాలతో పోలిస్తే తెలంగాణ అంశంపై అంత దూకుడుగా వెళ్లడం సరైంది కాదని, దీనివల్ల దెబ్బ తింటామని సీమాంధ్ర నేతలు...ప్రత్యేకించి రాయలసీమ నేతలు వాదిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో కూడా వారు ఇదే వాదన వినిపించారు. ఈ అంశం అంతర్గతంగా పార్టీలో వేడి పెంచుతుండటంతో కొన్ని మధ్యేమార్గ ప్రతిపాదనలు పార్టీ ముందుకు వస్తున్నాయని తెలుస్తోంది.