రసమయి బాలకిషన్: కెసిఆర్కు కౌంటర్
పాలమూరు స్థానానికి అనూహ్యం గా యెన్నం శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించి సాను కూల ఫలితం సాధించిన బీజేపీ, ఈసారి పరకాల లోనూ అదే ప్రయోగం చేయాలనుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు అనువైన అభ్యర్థి కోసం జరుపుతున్న అన్వేషణలో ఉన్న బీజేపీ నాయకత్వం ముందుకు అనూహ్యంగా ప్రముఖ కళాకారుడు రసమయి బాలకిషన్ పేరును కొందరు తెలంగాణ వాదులు ప్రతిపాదనకు తీసుకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటిదాక బాలకిషన్ అభ్యర్థిత్వంపై అంతగా దృష్టి సారించని బీజేపీ నాయకత్వం ఒక్కసారిగా రసమయిపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిసింది.
తమ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడిన కెసిఆర్కు గుణపాఠం చెప్పాలంటే రసమయి బాలకిషన్ను రంగంలోకి దించే విషయంపై బిజెపి నాయకత్వం తీవ్రంగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకిషన్కు ఉన్న ఆదరణ తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. రసమయి రంగంలో ఉంటే టీఆర్ఎస్ దూకుడుకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని స్థానిక పార్టీ నేతలు సైతం భావిస్తున్నట్టు తెలిసింది. తెరాసపై నిప్పులు చెరిగేందుకు బాలకిషన్ వద్ద తగిన సరుకు ఉందని కూడా బిజెపి నాయకులు అంటున్నారు.
ప్రస్తుతం పార్టీలో పరకాల టికెట్ కోసం అంతర్గతంగా ఎదురవుతున్న తీవ్రమైన పోటీని నివారించాలన్నా రసమయి లాంటి వివాద రహితుడు, తటస్థుడైన అభ్యర్థి అయితే మంచిదనే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉందంటున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయటానికి మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, యువ నేత జి.ప్రేమేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వారిలో ఎవరికి ఇచ్చినా రెండు రకాల చిక్కులను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఒకటి పార్టీలో ఒక వర్గాన్ని విస్మరించారన్న విమర్శ ఎదుర్కోవటం కాగా, మరొకటి రాష్ట్ర నాయకత్వం అగ్ర కులాలకే ప్రాధాన్యం ఇసుందన్న విమర్శ ఇంకొకటి. ఇప్పటికే పాలమూరులో యెన్నం శ్రీనివాసరెడ్డిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ పరకాలలో అదే వర్గానికి చెందిన వారికి ఇస్తే ఇబ్బంది అనే ఆలోచన సైతం ఉన్నట్టు చెబుతున్నారు. వీటిని తప్పించుకోవాలంటే రసమయి పేరును పైకి తీసుకు వస్తే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలకిషన్ను అభ్యర్థిగా ఎంపిక చేస్తే మరో ప్రయోజనం కూడా ఉందంటున్నారు. ఆయనను బీజేపీ అభ్యర్థిగా చూడకుండా ఒక నిబద్ధత కలిగిన కళాకారుడుగా మాత్రమే గుర్తిస్తారని, తద్వారా బీజేపీని వ్యతిరేకించే కళాకార సంఘాలు కూడా సానుకూలంగా స్పందించే వీలుంటుందన్న ఆలోచన ఉన్నట్టు తెలిసింది. పైగా కేసీఆర్ వ్యవహార శైలితో విసిగిపోయి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్న తెలంగాణ సంఘాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి బాలకిషన్కు అండగా నిలవటం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతున్నది. అన్నిటికీ మించి జాక్ నాయకత్వం పని కూడా సులభమవుతుంది. పరకాలలో తాము పోటీ చేయబోమని జాక్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో స్థానిక జాక్ సంఘాలు బాలకిషన్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ఆలోచన బీజేపీ నేతల్లో ఉన్నట్టు తెలిసింది.