దూకుడు తగ్గింది: కిరణ్ చట్రంలో బొత్స
దీంతో ముఖ్యమంత్రి, ఆయన వర్గం బొత్సను నిలువరించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో మద్యం సిండికేట్లపై జరిగిన దాడులు బొత్సను లక్ష్యంగా చేసుకొని కిరణ్ ప్రయోగించినవే అనే వ్యాఖ్యలు వినిపించాయి. అంతేకాదు కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద బొత్స ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీశారు. బొత్సపై నమ్మకంతో అధిష్టానం ఆయనకు పిసిసి అధ్యక్ష పదవిని అప్పగించింది. ఆయన ఓ వైపు పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు సిఎం పదవిపై తనకు ఉన్న మక్కువను ప్రదర్శించడం ఆయనకు చేటు తెచ్చింది.
కిరణ్ పాలన పట్ల కూడా తొలుత అధిష్టానం అసంతృప్తిని కనబర్చింది. అయితే ఇటీవల తెలంగాణ కవాతును సమర్థవంతంగా ఎదుర్కోవడం, జీవ వైవిధ్య సదస్సును విజయవంతం చేయడం వంటి పలు కారణాల వల్ల ఆయన కొన్ని మంచి మార్కులు కొట్టేశారు. కిరణ్ పట్ల అధిష్టానం వైఖరి క్రమంగా పాజిటివ్గా మారుతోంది. తన పట్ల అధిష్టానం సానుకూలంగా లేక పోవడం, తనకు విరుద్ధంగా కిరణ్ పరిస్థితి మెరుగు పడటం బొత్సకు మింగుడు పడటం లేదు.
దీంతో అతను కిరణ్తో పేచీకీ ప్రస్తుతానికి స్వస్తీ చెప్పారని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి ఏమో గానీ ఉన్న పిసిసి అధ్యక్ష పదవి ఊడకుండా ఉండాలంటే కిరణ్తో మంచిగా ఉండటమే తనకు బాగుంటుందని బొత్స భావిస్తున్నారట. ఇప్పుడు రాష్ట్రంలో లేదా కేంద్రంలో కిరణ్కు వ్యతిరేకంగా పని చేస్తే తన వ్యూహాలు ఫలించవని ఆయన తెలుసుకున్నారని అంటున్నారు. గతంలో కిరణ్కు చెక్ చెప్పేందుకు ప్రయత్నాలు చేసిన బొత్స మాత్రం ఇప్పుడు పూర్తిగా స్కెచ్లకు దూరంగా ఉంటున్నారట.
అప్పట్లో కిరణ్ పైకి చిరంజీవి వర్గాన్ని ఎగదోశారని, అసంతృప్తి వర్గాన్ని రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బొత్స పరిస్థితి బాగా లేకపోవడంతో పూర్తిగా తన దూకుడుని తగ్గించారని అంటున్నారు. అయితే బొత్స దూకుడు తగ్గించడంతో ఆయననే నమ్ముకొని కిరణ్ పైన కోల్డ్ వార్, బహిర్గత వార్ చేద్దామనుకున్న పలువురు నేతలతో పాటు బొత్స వర్గం నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
అయితే ఇలాంటి పరిస్థితిల్లో కిరణ్కు వ్యతిరేకంగా పని చేస్తే ముఖ్యమంత్రి వర్గం బొత్సకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అధిష్టానానికి ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటోంది. పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో బొత్స ప్రత్యామ్నాయంగా ఎదుగుతారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు కిరణ్ చట్రంలో ఆయన చిక్కుకోవడంతో ఆయనను నమ్ముకున్న వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.