చంద్రబాబుకు రాజ్యసభ సీట్ల చిక్కులు?
రెండు సీట్ల కోసం తెలుగుదేశం పార్టీలో పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన ప్రతిసారీ తెలుగుదేశం నుంచి నాయకులు తప్పుకున్న సందర్భాలున్నాయి. మోహన్ బాబు 1995 నుంచి 2000 వరకు రాజ్యసభ ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. జయప్రద 1996 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యురాలిగా టీడీపీ తరపున ఉన్నారు. ఆమె ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయి లోకసభకు ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె అమర్ సంగ్ వెంట ఉన్నారు.
రుమాండ్ల రామచంద్రయ్య 1998 నుంచి 2004 వరకు పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో ఉన్నారు. టి.తులసిరెడ్డి కూడా అంతే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఈయన తెలుగుదేశం తరఫున 1988 నుంచి 1994వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
వంగా గీత టీడీపీ తరపున 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. అనంతరం పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్లోకి చేరారు. మరో సీనియర్ నేత సి.రామచంద్రయ్య కూడా అంతే. కడప జిల్లాకు చెందిన ఈయన 1998 నుంచి ఏకంగా 2008 సుదీర్ఘ కాలం రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందేమోనని చంద్రబాబు అనుమానిస్తున్నారని అంటున్నారు.