ఒక్క దెబ్బకి 3 పిట్టలు: రాష్ట్రంపై కన్నేసిన అధిష్టానం
రోజురోజుకు రాష్ట్రంలో కల కోల్పోతుండటంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించింది. తెలంగాణ, వైయస్ జగన్ విషయంలో లేదు లేదంటూనే తన చాతుర్యాన్ని ప్రదర్శించింది. సాధారణ ఎన్నికలకు సంవత్సరం మూడు నెలలు మాత్రమే ఉండటంతో ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు వ్యూహాత్మకంగా కేబినెట్లో ఎపిలోని మూడు ప్రాంతాల వారికి పదవులు కట్టబెట్టారు. అందులోనూ సామాజికవర్గం, ప్రాంతాలు తదితరాలను పరిశోధించి, సునిశితంగా పరిశీలించిన తర్వాతనే ఆయా పదవులు కట్టబెట్టినట్లుగా కనిపిస్తోంది. అధిష్టానం అదును చూసి కొట్టిన కేబినెట్ దెబ్బ ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్న విధంగా ఉంది.
తెలంగాణలో తన పట్టును నిలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఎస్సీ కేటగరైజేషన్ను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకు వచ్చారు. అయితే కాంగ్రెసు పార్టీ కూడా అంతే ధీటుగా కౌంటర్ వేసింది. అదే సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణకు పదవి కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు వైపు వెళ్లాలనుకునే మాదిగలను తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
తెలంగాణలో ఎస్టీ జనాబా కూడా ఎక్కువే. వారిని కూడా మచ్చిక చేసుకునేందుకు బలరాం నాయక్ను కూడా మన్మోహన్ సింగ్ కేబినెట్లోకి తీసుకుంది. తెలంగాణ ప్రాంతంలో మాదిగలు, లంబాడీలు తమ వైపు ఉంటే తమకు తిరుగు ఉండదని కాంగ్రెసు పార్టీ భావించినట్లుగా కనిపిస్తోంది. ఆ వర్గాల్లో తెలంగాణవాద ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అది కూడా కాంగ్రెసుకు కలిసి వస్తుందని చెబుతున్నారు.
మాదిగ, లంబాడి సామాజిక వర్గానికి చెందిన సర్వే, బలరాంలకు పదవులు కేటాయించడం ద్వారా కొద్దిలో కొద్దిగానైనా తెలంగాణవాదాన్ని తగ్గించే వ్యూహం కాంగ్రెసు చేసిందంటున్నారు. వీరికి పదవులు కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం కాంగ్రెసు చేసింది. అప్పుడు ఆ వర్గాలు తెలంగాణవాదం కంటే తమకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెసు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో కిల్లీ కృపారాణికి పదవి కట్టబెట్టడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్రకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలు పంపించింది. అదే సమయంలో సీమాంధ్రలో బిసిలను తమ వైపుకు మళ్లించుకునే ప్రయత్నాలు చేసింది. రాయలసీమలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. పురంధేశ్వరికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. ఇలా కాంగ్రెసు వ్యూహాత్మకంగా రాష్ట్రానికి పదవులు కట్టబెట్టింది.
రాష్ట్ర చరిత్రలో పది పదవులు రావడం ఇదే తొలిసారి. ఇప్పుడు మరో ఐదుగురికి పదవులు కట్టబెట్టడం ద్వారా రాష్ట్రం నుండి కేంద్రమంత్రివర్గంలో ఉన్న వారి సంఖ్య పదికి చేరింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఏకంగా పదిమంది ఎంపీలకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. గతంలో మన రాష్ట్రానికే చెందిన పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఏడుగురు ఎంపీలకే మంత్రివర్గంలో చోటు దక్కింది. అదే సమయంలో పదవుల పంపకంలో చాణక్య నీతిని కనబర్చింది.
సమైక్య, ప్రత్యేక వాదాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వారిని పార్టీ దూరంగా పెట్టింది. తెలంగాణవాదంతో అధిష్టానానికి ఇబ్బందులు తీసుకు వస్తున్నా పొన్నం ప్రభాకర్, వివేక్, మంద జగన్నాథం, మధు యాష్కీ, సమైక్యనినాదంతో తెలంగాణవాదాన్ని రెచ్చగొడుతున్న కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావులను కూడా పక్కకు పెట్టింది. కావూరి, రాయపాటిలకు ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉన్నప్పటికీ వారికి ఇస్తే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడుతుందన్న భావనతో ఇవ్వట్లుగా తెలుస్తోంది.
చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడే ఇస్తామనే హామీ ఇచ్చారనే వాదన ఉంది. ఆపద సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదుకున్నందున చిరంజీవికి కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్లో విలీనమైనా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్న ఆవేదన ఉన్నా బహిర్గతం చేయలేదు. ఇవన్నీ గమనించిన అధిష్ఠానం చిరంజీవి వర్గానికి సముచిత స్థానం కల్పించడం కోసం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం కల్పించింది. చిరుకు పదవి రావడంతో ఆ వర్గంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెసు అన్ని కోణాల నుండి ఆలోచించి ఈ పదవులు కట్టబెట్టింది.