ధర్మాన అఫైర్స్: క్లైమాక్స్‌కు కిరణ్ రెడ్డి రాజకీయం

Dharmana Prasada Rao
హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యవహారంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం కూడా క్లైమాక్స్‌కు చేరినట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిని పీడిస్తున్న నాలుగైదు అంశాల్లో కాంగ్రెసు అధిష్టానం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే, కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం చివరి అంకానికి చేరినట్లే భావించాలి.

ప్రస్తుతం ముఖ్య మంత్రిని రాజకీయంగా అయితే ధర్మాన ప్రసాదరావు రాజీనామా, తమనెందుకు బలి చేస్తారని, మమ్మల్ని రక్షించే బాధ్యత మీకు ఉందా లేకపోతే మమ్మల్నే అధిష్ఠానం వద్దకు వెళ్ళమంటారా అని వట్టి వసంతకుమార్‌ తదితర మంత్రుల నాయకత్వంలో పెరుగుతున్న ఒత్తిడి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పాలనాపరంగా తీవ్రతరమవుతున్న విద్యుత్‌ కొరత, విపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శలు, ఆందోళనలు మరోవైపు ఇబ్బంది పెడుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే హస్తినలో మకాం వేసి ధర్మాన వ్యవహారంపై నాయకత్వంతో చర్చిస్తున్నారు.

ధర్మాన ప్రసాదరావు రాజీనామా, ఆయనపై దాఖలైన చార్జిషీట్‌ నేపథ్యంలో మంత్రి వట్టి వసంతకుమార్‌ నివాసంలో మంగళవారం జరిగిన సమావేశం, ఆ తర్వాత వట్టి బయటకు వచ్చి మాట్లాడిన తీరు, సిబిఐ దర్యాప్తును సవాల్‌ చేసిన నేపథ్యం వంటి పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి బుధవారం విద్యుత్‌ సమస్యపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను పవర్‌ గురించి మాట్లాడటానికే ఢిల్లీ వెళ్తున్నానని, దేవుడు దయ తలచి వర్షాలు కురిపిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనీ చెప్పారు.

అయితే ఇంత హఠాత్తుగా ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించటం పట్ల కాంగ్రెస్‌ వర్గాలలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలలో ఏవైనా మార్పులు ఉంటాయా అనేది చర్చకు ప్రధాన కారణమవుతోంది. మరోవైపు సీనియర్‌ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా విద్యుత్‌ సమస్యపై మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఉన్నట్టు తనకు తెలియదని, ఒక సీనియర్‌ మంత్రిగా మాత్రమే తాను బాధ్యతతో మాట్లాడుతున్నానని జానా చెప్పారు.

వాన్‌పిక్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటూ చార్జిషీట్‌ దాఖలైన మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారం ముఖ్యమంత్రికి మింగుడుపడని స్థాయికి చేరుకుంది. ఆయనను ఢిల్లీకి పిలిపించిన ప్రత్యేక కారణం ఇదే అని చెబుతున్నారు. నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని, విధులకు హాజరు కాబోనని ధర్మాన ఒకవైపు చెబుతుంటే, ఆయనకు మద్దతుఇచ్చేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ముఖ్యమంత్రిపై ఒత్తిడిని పెంచుతోంది.

మంత్రి వట్టి వసంతకుమార్‌ నివాసంలో మంత్రులు భేటీ అయి జగన్‌ను టార్గెట్‌ చేస్తూ, ధర్మానకు సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. మంత్రులు తనతో ఏమి మాట్లాడారో మీడియాకు తెలియదని, ధర్మాన రాజీనామా లేఖ ఇంకా తన వద్దనే ఉందని ముఖ్యమంత్రి చెప్పటం విశేషం. ఇంకోవైపు ధర్మాన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి తనకు పంపిస్తే రాజ్యాంగబద్ధంగా ఏమి చేయాలో అది చేస్తానని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఢిల్లీ పిలిపించటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవలి కాలంలో అధిష్ఠానం పెద్దలు పలు సందర్భాలలో చెప్పారు. ఉప రాష్టప్రతి ఎన్నిక కూడా ముగిసిపోయింది కాబట్టి అధినాయకత్వం దానిపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని టీ కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో సాధ్యమైనంత త్వరగా తెలంగాణ అంశానికి తెర దించితే మంచిదన్న ఆలోచనలో నాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+