కెసిఆర్ ప్లాన్: ఉరుకులు వద్దు, పడిపోతే రెడీ

తొలుత ఈనెల 23న సూర్యాపేటలో తలపెట్టిన సభ నిర్వహణపై చర్చ జరిగిన తర్వాత రాజకీయాలపైకి మళ్లింది. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మాత్రం దాన్ని అవకాశంగా తీసుకోవాలని కేసీఆర్ సహా పార్టీ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన వ్యూహాన్ని మాత్రం అనుసరించకూడదని పార్టీ అభిప్రాయపడింది.
ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. నిజానికి జగన్తో పాటు కెసిఆర్ కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే క్షేత్రంలో పరిస్థితి తమ పార్టీకి అనుకూలంగా ఉందని, కనీసం 70-80 అసెంబ్లీ స్థానాలు ఎక్కడికీ పోవనే భావన తెరాస నాయకుల్లో వ్యక్తమవుతోంది.
ఒకవేళ ప్రభుత్వం పడిపోవటం ద్వారా ఎన్నికలు వస్తే అనుకున్న వంద సీట్లు గెల్చుకోవటానికి మిగిలిన 20-30 స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని నిశ్చయించారు. కేంద్రంలోనూ రాజకీయ అనిశ్చితి నెలకొన్న దరిమిలా లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి లేదా విడివిడిగా ఎన్నికలు జరిగినా సత్తా చాటాలని నిర్ణయించారు.
ప్రస్తుతం అసెంబ్లీలో తెరాస బలం వారికి మద్దతు ఇస్తున్న స్వతంత్ర సభ్యుడు సోమారపు సత్యనారాయణతో కలుపుకొని 18 మంది ఎమ్మెల్యేలు. తెలుగుదేశం నుంచి బయటికి వచ్చిన ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి కూడా తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమ బలం 19గా చెబుతున్న తెరాస వర్గాలు, కాంగ్రెస్, టిడిపిలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయంగా తమకు లాభమని తెరాస ముఖ్యులు ఎప్పటి నుంచో భావిస్తున్నారు.
అలాగే, ప్రభుత్వానికి ఢోకా ఉండకపోవచ్చని, మజ్లీస్-కాంగ్రెస్ వివాదం సమసిపోవచ్చనే భావన కూడా నుంచి వ్యక్తమవుతోంది. అవిశ్వాస ప్రతిపాదనకు అవసరమైన బలం తమకు లేనప్పుడు దాని జోలికి వెళ్లి అభాసుపాలు కావటం ఎందుకనే భావన తెరాస ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. మజ్లీస్, జగన్ కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే అభిప్రాయం కూడా పార్టీలో ఉంది.












Click it and Unblock the Notifications