ప్రత్యర్థులపై కిరణ్ కుమార్ రెడ్డి కొరడా
కొంత మంది మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, పదవీ వ్యామోహంలో పడిపోయారని, వారు పార్టీకి ఎనలేని నష్టం కలిగిస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని రంగారెడ్డి నాయకత్వంలోని ఏడుగురు ప్రతినిధుల బృందం అహ్మద్ పటేల్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎసిబి దాడుల్లో లిక్కర్ సిండికేట్లతో ప్రమేయం ఉందని బయటపడిన మంత్రులు, శాసనసభ్యుల వివరాలను, ఇసుక మాఫియాతో సంబంధాలున్న పార్టీ శాసనసభ్యుల వివరాలను వారు అహ్మద్ పటేల్కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. విశ్వాసపాత్రుడు, నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి ఉండడం వారికి ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వంపై, ప్రభుత్వ పథకాలపై తప్పుడు సమాచారం వ్యాపింపజేయడానికి వారంతా కుమ్మక్కయ్యారని ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఆర్థిక శాఖలో ప్రవేశపెట్టిన గ్రీన్ చానెల్ వల్ల బిల్లుల్లో, చెల్లింపుల్లో అవకతవకలు లేకుండా పోయాయని, ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోని పద్ధతిలో అది నడుస్తోందని, చాలా మంది మంత్రులకు అది రుచించడం లేదని, నిధుల విడుదలను కూడా క్రమబద్దీకరించారని, కాంట్రాక్టర్లకు పని చేయకుండా డబ్పులు అందడం లేదని, ఇది కూడా నచ్చడం లేదని వారు అహ్మద్ పటేల్కు వివరించినట్లు సమాచారం. ఇలాంటి కొన్ని చర్యలు కొంత మంది మంత్రులకు నచ్చకపోవడంతో ముఖ్యమంత్రిపై దుష్ప్రచారానికి పూనుకుంటున్నారని రంగారెడ్డి బృందం అధిష్టానానికి విన్నవించింది.