కోదండరామ్కు చిక్కులు: పాలమూరు రిపీట్?
స్వామి గౌడ్పై బిజెపి పోటీ అనైతికమని కెసిఆర్ చేసిన వ్యాఖ్య బిజెపి నాయకులను రెచ్చగొట్టిందని అంటున్నారు. కెసిఆర్ వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలు వేరు, ఉద్యమాలు వేరు అని వ్యాఖ్యానిస్తూ, అసలు స్వామిగౌడ్ అభ్యర్థిత్వాన్ని తమతో సంప్రదించకుండా ప్రకటించారని చెప్పారు. స్వామిగౌడ్ను తాము తెరాస అభ్యర్థిగానే పరిగణిస్తామని, తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపి తీరుతామని అన్నారు. పరకాల, పాలమూరు ఉప ఎన్నికలలో పోటీ చేసినట్టే ఈసారీ బరిలో ఉంటామన్నారు.
బీజేపీ జాతీయ పార్టీ కాదని, పెద్ద ప్రాంతీయ పార్టీ మాత్రమేనని కెసిఆర్ కరీంనగర్ మేధోమథన సదస్సు సందర్భంగా అనడమే బిజెపి నాయకులను రెచ్చగొట్టిందని అంటున్నారు. రెండు తెలంగాణ పార్టీల మధ్య చిచ్చు కోదండరామ్ను ఇరకాటంలో పెడుతోందని అంటున్నారు. ప్రస్తుత పరిణామం తెలంగాణ జెఎసిలోనే చిచ్చు పెడుతుందా అనే అనుమానాలను కలిగిస్తున్నాయి. పాలమూరు, పరకాల ఉప ఎన్నికల తర్వాత కెసిఆర్తో సంబంధాలు దెబ్బ తినడంతో కోదండరామ్ ఇటు బిజెపితో, అటు సిపిఐతో సంబంధాలను పెంచుకున్నారు.
తాజా పరిణామంతో కోదండరామ్ చిక్కుల్లో పడినట్లే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా కోదండరామ్ పరిస్థితి తయారైంది. తెలంగాణ రాజకీయ పార్టీలను సమన్వయ పరచడం ఆయనకు సమస్యగానే తయారైంది. ఆయా పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణ ఉద్యమానికి ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా మారింది.