పార్టీలకు గుప్త నిధులు: అక్కడ కాంగ్రెస్, ఇక్కడ టిడిపి

2004-2011 మధ్య కాలంలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఆదాయపన్ను వివరాలు, దాతల జాబితాలను ఆధారంగా చేసుకుని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఇడబ్ల్యు) సంస్థలు 23 ప్రధాన రాజకీయ పార్టీల ఆదాయ వివరాల జాబితాను విడుదల చేశాయి. 2004 నుంచి రాజకీయ పార్టీల ఆదాయం గణనీయంగా పెరిగిందని, 2004లో రూ. 222 కోట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదాయం 2011లో ఏకంగా రూ. 307 కోట్లకు పెరిగిందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. బిజెపి ఆదాయం కూడా ఇదేవిధంగా పెరిగినట్టు ఆ సంస్థలు వెల్లడించాయి.
2004 నుంచి 2011 వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 2,008 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, ఇందులో విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 14.42 శాతం మాత్రమేనని, కూపన్ల అమ్మకం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆదాయాన్ని సాధించిందని ఎడిఆర్, ఎన్ఇడబ్ల్యు విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే గత ఏడేళ్లలో బిజెపి మొత్తం రూ. 994 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఇందులో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాల రూపంలో వచ్చిన ఆదాయమే 81.47 శాతంగా ఉందని ఆ సంస్థలు వెల్లడించాయి. లండన్లో లిస్టయిన వేదాంత ఎన్జిఓ, పలు ఇతర కార్పొరేట్ సంస్థలు బిజెపికి విరాళాలు అందజేశాయని, ఆదిత్య బిర్లా గ్రూప్, టోరంట్ పవర్ లిమిటెడ్ సంస్థలు అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బిజెపికి కూడా విరాళాలు అందజేశాయని ఆ సంస్థలు పేర్కొన్నాయి.
ఇదేవిధంగా గత ఏడేళ్లలో బిఎస్పి 484 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించగా, సిపిఎం రూ. 417 కోట్లు, సిపిఐ రూ. 6.7 కోట్లు, సమాజ్వాదీ పార్టీ రూ. 278 కోట్లు, ఎన్సిపి రూ. 160 కోట్లు, ఎఐఎడిఎంకె రూ. 59 కోట్లు, శిరోమణి అకాలీ దళ్ రూ. 25 కోట్లు, నేషనల్ కాన్ఫరెన్స్ రూ. 21 కోట్లు, జెడి (యు) రూ. 26 కోట్లు, తెలుగుదేశం పార్టీ రూ. 53 కోట్లు, డిఎంకె రూ. 40 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ రూ. 9 కోట్లు, శివసేన రూ. 32 కోట్లు, లోక్ జనశక్తి పార్టీ రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 10 కోట్లు, రాష్ట్రీయ జనతా దళ్ రూ. 10 కోట్లు, ఫార్వర్డ్ బ్లాక్ రూ. 98 లక్షలు, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ రూ. 92 లక్షలు చొప్పున సంపాదించినట్టు ఎడిఆర్, ఎన్ఇడబ్ల్యు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications