సోనియా వర్సెస్ దీదీ: యుపిఎ నుంచి అవుట్?
పశ్చిమ బెంగాల్లోని పూర్తి లోకసభ సీట్లు 42 కూడా తామే గెలుస్తామని ఆయన సోమవారం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుతో కలిసి నడవడానికి తృణమూల్ కాంగ్రెసు సిద్ధంగా లేదని ఈ ప్రకటన తెలియజేస్తోంది. రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి పనిచేసే విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరుతోంది. 2014 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పడానికి ముఖోపాధ్యాయ ప్రకటన వీలు కల్పిస్తోంది.
సోనియా గాంధీ నివాసం బయటనే ముఖోపాధ్యయ ఆ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సోనియా గాంధీ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఆయన హాజరయ్యారు. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థి హమీద్ అన్సారీకి మద్దతు ఇస్తున్న యుపిఎ భాగస్వామ్య పక్షాలకు, ఇతర పార్టీలకు సోనియా గాంధీ తన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని దీదీ ఇప్పటికే చెప్పారు. యుపిఎ నుంచి తమంత తాము వైదొలగబోమని, అయితే ఉండలేని పరిస్థితులు కల్పిస్తే బయటకు రాక తప్పదని ఆమె గతంలో ఓసారి అన్నారు. హమీద్ అన్సారీపై ఎన్డీయే అభ్యర్థిగా జస్వంత్ సింగ్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తలపడుతున్నారు. హమీద్ అన్సారీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.