రాష్ట్రపతి ఎన్నికలు: జగన్ మద్దతు ఎవరికి?

శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల సంఖ్య 17కు పెరిగింది. లోకసభలో రెండుకు పెరిగింది. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓట్లలో జగన్ పార్టీ ఓట్లు చాలా తక్కువే. రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ వోట్లు మొత్తం 11 లక్షలు కాగా, జగన్ పార్టీ ఓట్లు కేవలం 3,900 మాత్రమే. అయితే, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ ప్రకటించింది. ఇంకా ఆట ముగిసిపోలేదని తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ అంటున్నారు. జెడియు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని అంటున్నారు. ఈ స్థితిలో జగన్ మద్దతు కూడా ముఖ్యమేనని భావిస్తున్నారు.
కాంగ్రెసు అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అంగీకరించినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. తెరాసకు 18 మంది శానససభ్యులు, ఇద్దరు లోకసభ సభ్యులు ఉన్నారు. దాదాపుగా తెరాస బలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్నంత బలమే ఉంది.
కాగా, వైయస్ జగన్ను కాంగ్రెసు దూరం చేసుకోవద్దని వాదించినవారిలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ ఉన్నారని అంటారు. ఈ స్థితిలో వైయస్ జగన్ ప్రణబ్ ముఖర్జీకి మద్దతిస్తారా అనేది వేచి చూడాల్సిందే. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే తాను ఎటు వైపు ఉంటాననే విషయాన్ని జగన్ ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవంగా కాకపోతే మాత్రం తప్పకుండా ఓ వైఖరి తీసుకోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications