తెలంగాణపై కసరత్తు: వాయలార్ రవిపై దృష్టి
హైదరాబాద్: కేంద్ర మంత్రి వాయలార్ ఆదివారం రాక తెలంగాణ నాయకుల్లో ఆశలను రేకెత్తించింది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వివాహ స్వర్ణోత్సవానికి మాత్రమే ఆయన వచ్చారని సీమాంధ్ర నాయకులు చెబుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కసరత్తులో భాగంగా ఆయన తెలంగాణ నాయకులు చెబుతున్నారు. నిజానికి, వాయలార్ రవి ఆదివారం ఉదయమే హైదరాబాదు రావాల్సి ఉండింది. అయితే, సాయంత్రం పూట వచ్చారు. తెలంగాణ అంశం కారణంగానే ఆయన ఢిల్లీ నుంచి ఆలస్యంగా హైదరాబాదు వచ్చినట్లు చెబుతున్నారు.
శనివారంనాడు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వివిధ కేంద్ర మంత్రులతో భేటీ కావడాన్ని కూడా అందులో భాగంగానే చూస్తున్నారు. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, చిదంబరం, సుశీల్ కుమార్, జైపాల్ రెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదు విషయాన్ని ఎలా తేల్చాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. దీనిపైనే గవర్నర్ కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లు వినికిడి.
తెలంగాణపై అధిష్టానం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే వాయలార్ రవి హైదరాబాద్ వచ్చారని చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటే ముఖ్యమంత్రి మార్పు కూడా ఉంటుందని భావిస్తున్నారు. సెప్టెంబర్ లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు కూడా గట్టిగానే చెబుతున్నారు.
తెలంగాణ అంశం కారణంగానే జైపాల్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య విభేదాలు రచ్చకెక్కాయని అంటున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంపై కూడా వాయలార్ రవి దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. జైపాల్ రెడ్డికి అనుకూలంగా, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెసు తెలంగాణ నాయకుల్లో ఓ బలమైన లాబీ ముందుకు కదులుతోంది. వి. హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పడుతూ జైపాల్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు.