జగన్ బయట పడకుండా.. నోటీసులపై ఏం చేద్దాం?

ఇప్పటికే మంత్రులు అందరూ ప్రభుత్వ జారీ చేసిన జివోల బాధ్యత మంత్రి వర్గానిదేనని చెబుతున్నారు. అదే సమయంలో తెరచాటు వ్యవహారాలకు తమ బాధ్యత లేదని స్పష్టం చేస్తున్నారు. జివోలలో ఏ తప్పు జరిగినా దానికి మేం బాధ్యత వహిస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతూ వస్తున్నారు. జివోలలో ఏ తప్పు జరగలేదని కుండబద్దలు కొడుతున్నారు. బొత్స ఈ వ్యాఖ్యలను నోటీసులు అందుకున్న మంత్రులు కూడా తాజాగా ఉచ్చరిస్తున్నారు. మంత్రి గీతా రెడ్డి తదితరులు ప్రభుత్వ విధానాలకనుగుణంగానే జివోల జారీ జరిగిందని, తెరచాటు విషయాలపై సంబంధం లేదని చెప్పారు. దీంతో జగన్ ఇరుకున పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారట.
కాగా మంత్రులకు నోటీసుల విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తాము సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం అధికారపక్షంలో నెలకొన్నదట. సుప్రీం కోర్టు నోటీసులు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకూ అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటుంటే అధికారపక్షం నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకుండా పోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు వాపోతున్నారట. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మించిన వారు లేరని మంత్రి శ్రీధర్ బాబు లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ తరఫున మొదటి సారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురు సీనియర్ మంత్రుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయాన్ని మంత్రి రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు నోటీసులకు వివరణ ఇవ్వాల్సిన మంత్రులు స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకొంటే బాగుంటుందని వారు వాదిస్తున్నారట. పాత మంత్రులందర్నీ తొలగించాలని కొత్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని సిఎంతో రఘువీరా అన్నారు.












Click it and Unblock the Notifications