జగన్ బలమెంత?: కిరణ్ సర్కార్లో ఆందోళన
కిరణ్ సర్కారు భవితను నిర్దేశించనున్న ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భవిత ఏమిటి? జగన్ అసలు బలం ఎంత? అన్న ప్రశ్నలకు కూడా ఈ ఉప ఎన్నికల్లో సమాధానం లభిస్తుందని అధికార పక్షం భావిస్తోంది. అయితే ఎలాగైన జగన్ బలాన్ని ఉప ఎన్నికల్లో తగ్గించాలని కాంగ్రెసు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
అలా అయితేనే ఉప ఎన్నికల తర్వాత, 2014లోనూ కాంగ్రెసుకు ఆయన నుండి ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తోంది. అంతేగాకుండా తెలంగాణ రాష్ట్ర సమస్యపై అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది.
సిపిఎం వంటి వామపక్ష పార్టీలు 2014లో జగన్తో జట్టు కట్టే అవకాశం ఉందా? అన్న సందేహానికి కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాలే సమాధానమిస్తాయన్న అభిప్రాయం అధికార పార్టీలో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కిరణ్ పని తీరుపై కూడా ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం వెల్లడికానుంది. ఇలా ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్లోని ముఖ్య నేతల రాజకీయ భవిష్యత్తు ఈ ఫలితాలపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం విషయంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల కంటే కాస్త వెనుకబడి ఉన్న పాలకపక్షం ఒక్కసారిగా మేల్కొంది. కిరణ్, బొత్స అభ్యర్థులను ఖరారు చేసే పనిని ముమ్మరం చేశారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ఉప ఎన్నికలు ప్రధానంగా మారాయి. ఒక్క స్థానం తమది కాకపోయినప్పటికీ కొన్ని సీట్లను అయినా గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలలో మూడు నుండి ఐదు చోట్ల టిడిపి గెలిచే అవకాశముందని తేలింది. ఇవి ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.