అప్పుడే ఆఖరి ఆస్త్రం: విజయమ్మ గట్టెక్కించగలరా
జగన్ బయటకు వస్తే పార్టీని మళ్లీ గాడిలో పెట్టి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారని అందరూ భావించారు. కానీ సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. దీంతో ఇప్పుడు పార్టీని సమర్థవంతంగా నడిపించే నేత పైన చర్చ జరుగుతోంది. విజయమ్మ పైన నేతలంతా ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆమె జగన్లా క్రౌడ్ పుల్లర్ గానీ, మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి గానీ కారు. అంతేకాదు.. ప్రభుత్వం అసమర్థతను గట్టిగా నొక్కి చెప్పలేరని, ఇతర పార్టీల విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టలేరని భావిస్తున్నారు.
ఎన్నికల్లో గెలిచినా, సభలకు, సమావేశాలకు, ధర్నాలకు జనం వచ్చినా ఇప్పటి వరకు అంతా జగన్ సెంటిమెంట్ పైనే పార్టీని నడిపించారు. పార్టీ స్థాపించినప్పుడు వైయస్ సెంటిమెంట్, ఉప ఎన్నికల్లో జగన్ అరెస్ట్ సెంటిమెంట్ తదితర అంశాలు ఆ పార్టీకి బాగా కలిసి వచ్చాయి. కానీ పార్టీకి ఇప్పటి వరకు సరైన పునాదులు లేవు. జగన్ బయట ఉంటే పార్టీ బలోపేతం పైన దృష్టి సారించేవారు. ఓదార్పు, దీక్షలు, సమావేశాలు, భేటీల పేరుతో పార్టీని ముందుకు తీసుకు వెళ్లేవారు. విజయమ్మ కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి మొక్కుబడిగా మాత్రమే కనిపిస్తాయని చెబుతున్నారు.
జగన్ బయటకు రాకుంటే ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదంటున్నారు. జగన్ విజయమ్మను ఆఖరున ప్రయోగించాల్సిన అస్త్రం అని మొదటి నుండి వినిపిస్తున్నదే. 2014 ఎన్నికలప్పుడు ఆమె జగన్కు మంచి ఆయుధంగా ఉపయోగపడేది. కానీ ఇప్పుడే ఆమె బయటకు రావడంతో ఆమె పదును తగ్గే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇది జగన్కు నష్టం కలిగించే అంశమే అని చెబుతున్నారు. జగన్లా విజయమ్మ పార్టీని గట్టెక్కించడం కష్టమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే గియితే జగన్ బయటకు వచ్చే వరకు వైయస్, జైలు సెంటిమెంట్ పైన లాక్కొని రావాల్సిందేనని చెబుతున్నారు. విజయమ్మతో పాటు పార్టీలో కొణతాల రామకృష్ణ, మైసూరా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి నేతలు ఉన్నప్పటికీ వారికి పార్టీని నడపగల్గిన శక్తి సామర్థ్యాలు లేవని చెబుతున్నారు. జగన్ బయట ఉన్నప్పుడు అంతా ఆయనే కేంద్రంగా నడవటం మైనస్ అయిందంటున్నారు. జగన్ తన తర్వాత నేతలను సమాయత్తం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు జగన్ తప్ప మరో నేత లేడని చెబుతున్నారు.