ఇలా కుదరదు: జగన్తో కలయికపై లేటుగా లేచారు
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విషయంలో జగన్ నిత్యం కాంగ్రెసు పార్టీ నేతలను, అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నారనే చెప్పవచ్చు. ఆయన వైపుకు ఎప్పుడు ఏ ఎమ్మెల్యేలు వెళతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అవిశ్వాస తీర్మానం సమయంలో ఆఖరు నిమిషం వరకు కాంగ్రెసుకే ఓటేస్తానని చెప్పి ఆ తర్వాత హఠాత్తుగా పెద్ద షాక్ ఇచ్చారు. ఇలాంటి పరిణామాలను కాంగ్రెసు జీర్ణించుకోలేకపోతోంది.
జగన్తో ములాకత్ అయ్యాకే తమ నియోజకవర్గం టిక్కెట్ పైన హామీ వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నేతలు అతనిని జైలులో కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెసు పెద్దలు జైలులో జగన్ను కలుస్తున్న వారిపై నిఘా ఉంచారట. జగన్ను ఎవరెవరు కలుస్తున్నారనే వివరాలు జైలు అధికారులు రాస్తారు. ఇప్పటి వరకు జగన్ వైపు కాంగ్రెసు, టిడిపిల నుండి 34 మంది ఎమ్మెల్యేల వరకు వెళ్లారు.
అందులో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే 25 మంది. జగన్ వైపు వెళ్లిన వారిపై టిడిపి ఎప్పటికప్పుడు తీవ్రంగానే స్పందిస్తోంది. కానీ, కాంగ్రెసు మాత్రం వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. అవిశ్వాసం తీర్మానం తర్వాత మాత్రం కాంగ్రెసు పార్టీ నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో పడిందట. జగన్తో ములాకత్ తర్వాత తమ టిక్కెట్ పైన, తమ రాజకీయ భవిష్యత్తు పైన హామీ వచ్చిన పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ను కలిసే నేతలపై నిఘా వేయడంతో పాటు అతనిని కలిసేందుకు నిబంధనల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించిన సమయంలో విజయమ్మ ఒక్కరే అసెంబ్లీలో ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇకనైనా జగన్తో ములాకత్లు తగ్గించడంతో పాటు, అలాంటి వారిపై నిఘా పెట్టే విధంగా కాంగ్రెసు పార్టీ చర్యలు తీసుకుందట.