స్వీట్సిచ్చారు: ఐతే ఓకే ఢిల్లీకి కెసిఆర్ సంకేతాలు
అయితే కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే నిజమైతే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. అప్పుడు తెరాస, బిజెపి వంటి తెలంగాణవాద పార్టీలు కూడా తుడిచి పెట్టుకుపోతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెరాసలోను ఇప్పుడు అదే ఆందోళన కనిపిస్తోందంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ ఇస్తే కలిసి నడిచేందుకు సిద్ధమని కెసిఆర్ సంకేతాలు పంపించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మేరకు మధ్యవర్తుల ద్వారా అధిష్టానానికి సమాచారమందించారనే ప్రచారం సాగుతోంది. రాయల తెలంగాణను మాత్రం వ్యతిరేకించాలని ఆయన భావిస్తున్నారట. ఆయన కొద్ది రోజులుగా ఢిల్లీలో పరిణామాలను ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతల ద్వారా ఢిల్లీ విషయాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇటీవలి వరకు తెలంగాణ విషయమై అధిష్టానం కెసిఆర్తో చర్చలు జరిపేది. తమ పార్టీ నేతలకు గాలం వేస్తుండటంతో మదనపడిన కాంగ్రెసు.. ఈసారి తెలంగాణ క్రెడిట్ తమకే దక్కాలనే పక్కా వ్యూహంతో వెళ్తోందని అంటున్నారు. అందుకే కెసిఆర్ను ఈసారి పక్కన పెట్టిందంటున్నారు. అయితే తనను ఈ నెలాఖరు వరకైనా పిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వదల్చుకుంటే కాంగ్రెసు కెసిఆర్తో మాట్లాడుతుందన్నారు.
అయితే క్రెడిట్ తామే కొట్టేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్న కాంగ్రెసు ఎంత మేరకు కెసిఆర్ను పిలుస్తుందనేది ప్రశ్నార్థకమే అంటున్నారు. తెరాసను పక్కన పెట్టి మరీ కాంగ్రెసు రాజకీయ ఐకాస, విద్యార్థి ఐకాస, ప్రజా సంఘాల ఐకాసలతో సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెసు తెలంగాణ ఇస్తే తెరాస భవిష్యత్తుకు కొంత ఇబ్బంది తప్పదని, రాష్ట్రమిస్తారనే ప్రచారం జరగడంతో ఆపరేషన్ ఆకర్ష్ కూడా వాడిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాంగ్రెసులో కలిపేందుకే కెసిఆర్ మొగ్గుచూపవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కెసిఆర్ షరతులు పెట్టే పరిస్థితిలో లేరని కాంగ్రెసు నేతలు అభిప్రాయపడుతున్నారట. ఒకప్పుడు కెసిఆర్ కాంగ్రెసుకు షరతులు పెట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెసు తెరాసను విలీనం చేసే విషయమై కూడా చర్చించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇటీవల వి హనుమంత రావు లాంటి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే తెరాస విలీనం అవుతుందన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే కాంగ్రెసుకు లబ్ధి చేకూరుతుందని దాదాపు అందరూ భావిస్తున్నారు.
నిన్న దిగ్విజయ్ సింగ్ను కలిసిన ఓయు జెఏసి నేతలకు ఆయన స్వీట్స్ ఇచ్చారు. తొందర్లోనే మీ అందరికీ తీపి కబురు చెబుతానని, ఎవరూ అధైర్యపడవద్దని, వెళ్ల మీ వాళ్లందరికీ ఈ మాట చెప్పమని దిగ్విజయ్ ఓయు విద్యార్థులకు చెప్పారు. తద్వారా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తుందనే ప్రచారానికి మరికొంత బలం చేకూరింది. తెలంగాణ ఇస్తుందనే ప్రచారం జరగడం, కెసిఆర్ షరతులు విధించే పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో కాంగ్రెసు తెరాస పార్టీ విలీనంపై ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయంటున్నారు.