హరీష్పై కెసిఆర్ స్కెచ్: రాములమ్మ గుబులు
కెసిఆర్ భావించినట్లుగా 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాలు కాకపోయినా అరవై నుండి డెబ్బై వరకు స్థానాలలో ఖచ్చితంగా గెలుపొందుతామనే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నారట. అయితే, ఎక్కువ స్థానాల్లో తెరాస గెలిచేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారట. అందులో భాగంగా ఇటీవల మార్పులు, చేర్పులకు కూడా సిద్ధమవుతున్నారట. పనిలో పనిగా పార్టీలో కొందరికి చెక్ చెప్పే పనిలో కూడా పడ్డారని చెబుతున్నారు.
ఇటీవల కెసిఆర్ సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావును పొగిడారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయం ఖాయమని ప్రశంసించారు. కెసిఆర్ ఆ వ్యాఖ్యల్ని వ్యూహాత్మకంగా చేశారని, వచ్చేసారి హరీష్ రావును సిద్దిపేట నుండి కాకుండా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి బరిలోకి దించాలనే ఆలోచనలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జంటనగరాలతో పాటు, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణవాదం తక్కువగా ఉందనే వాదన ఎప్పటి నుండో ఉంది.
తెలంగాణవాదుల్లో దూకుడు వ్యక్తిగా ముద్రపడిన హరీష్ రావు సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తే తెరాసకు లభ్ది చేకూరుతుందని కెసిఆర్ భావిస్తున్నారట. మరోవైపు తెలంగాణవాదం అంతగా లేని నగరం నుండి హరీష్ రావును పోటీ చేయించడం ద్వారా ఆయనకు చెక్ చెప్పే ఉద్దేశ్యం కూడా ఏమైనా ఉందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి కెసిఆర్ కూతురు ఖాయమైనప్పటికీ ఆమె సిద్దిపేట నుండి కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
నిజామాబాద్ నుండి కవిత పోటీ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎంపీ మధుయాష్కీ తెరాస పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని కవితను అక్కడి నుండి కాకుండా సిద్దిపేట నుండి పోటీ చేయించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. అయితే, కవిత ససేమీరా అంటే మాత్రం నిజామాబాదు నుండే ఆమె బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయట. హరీష్ రావును సికింద్రాబాదుకు పంపించే ఆలోచన కెసిఆర్కు రావడం వెనుక ఓట్లు కొల్లగొట్టేందుకా? లేక చెక్ పెట్టేందుకా? అనే చర్చ సాగుతోంది.
మరోవైపు మెదక్ పార్లమెంటుపై బహిరంగంగానే చర్చ సాగుతోంది. ఈ సీటును వదిలేసేందుకు విజయశాంతి ససేమీరా అంటున్నారు. కెసిఆర్ మాత్రం రమణాచారి లేదా తాను అక్కడి నుండి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది విజయశాంతికి గుబులు రేకెత్తిస్తోంది. మెదక్ సీటును కెసిఆర్ ఇస్తే సరి లేదంటే ఆమె బిజెపిలో చేరేందుకు సిద్దమవుతున్నారట.