ముగ్గురే టార్గెట్: తెలంగాణ వైపు మొగ్గు?(పిక్చర్స్)
తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్రంగా యోచిస్తోంది. ఇటీవల భారీ ప్యాకేజీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. అధిష్టానం మదిలోను అదే ఉందంట. అయితే భారీ ప్యాకేజీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో అధిష్టానం ప్యాకేజీ పైన వెనక్కి తగ్గి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికే మొగ్గు చూపుతోందట. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణనా? లేక రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఇవ్వాలా? అనే అంశంపై తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. తెలంగాణపై అధిష్టానం చర్చోపచర్చలు జరుపుతోంది.
ప్రధానంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై దృష్టి సారించారట. ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సైతం దీనిపై చర్చలు సాగిస్తున్నారు. 2014లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఇస్తామని ప్రధాన ప్రతిపక్షం బిజెపి చెబుతుండగా.. అసెంబ్లీలో తీర్మానం పెట్టిస్తామని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఇంకోవైపు తెలంగాణవాదం గట్టిగా ఉండటంతో బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెసును తెలంగాణ ప్రాంతంలో కనిపించకుండా చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తామే తెలంగాణను ఇచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని కాంగ్రెసు పార్టీ భావిస్తోందంటున్నారు. నెంబర్ గేమ్ను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెసు తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం మదిలో మూడు ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదుతో కూడిన పది రాష్ట్రాల తెలంగాణను ఇవ్వడం, కర్నూలు, అనంతలతో కలిపి తెలంగాణ ఇవ్వడం, నాయకత్వ మార్పిడి మూడోది. అయితే మూడో దానికంటే మొదటి రెండింటి వైపే అధిష్టానం దృష్టి సారిస్తోందట.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, ప్యాకేజీ ఇచ్చినా ఇరు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ ఇస్తే ఎక్కువ వ్యతిరేకత రాకపోవచ్చునని భావిస్తోందట. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఒక్క దెబ్బకు పిట్టలు అన్న చందంగా తమకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెసు పార్టీ భావిస్తోందంటున్నారు.
తెలంగాణ ప్రకటన ద్వారా తెలంగాణలో బలంగా ఉన్న తెరాసను నామరూపాలు లేకుండా చేయడం, క్రమంగా బలపడుతున్న బిజెపికి కౌంటర్ ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో విభజన ద్వారా తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాల్లోను దెబ్బ తీయవచ్చునని, ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఒకే ప్రాంతానికి పరిమితం చేసినట్లవుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కావూరి సాంబశివ రావు, జెడి శీలంలకు పదవులు కట్టబెట్టడం వ్యూహంలో భాగమే అంటున్నారు. కరడుగట్టిన సమైక్యవాదుల నుండి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పదవులు కట్టబెట్టారని అంటున్నారు.
విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో తెరాసతో సహా అన్ని పార్టీలను మట్టుబెట్టి క్లీన్ స్వీప్ చేయవచ్చునని, సీమాంధ్ర నేతలకు పదవులు కట్టబెట్టడం ద్వారా, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయవచ్చునని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ ఇచ్చి తెలంగాణలో తెరాస, బిజెపి, రెండు ప్రాంతాల్లో టిడిపిని మసకబార్చడమే కాకుండా.. జగన్ పార్టీని ఒక ప్రాంతానికి పరిమితం చేసి బలహీనం చేయాలనే అభిప్రాయంతో ఉందంటున్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ లేదా రాయల తెలంగాణ ప్రకటన ద్వారా చంద్రబాబు, వైయస్ జగన్, కెసిఆర్లను బలహీనపర్చి, ఒక్క దెబ్బకు మూడు పిట్టలను కొట్టాలని భావిస్తోందంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లారు. వారితో అధిష్టానం చర్చలు జరుపుతోంది.
తెలంగాణపై కాంగ్రెసు మదిలో ప్రధానంగా మూడు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఒకటి తెలంగాణ, రెండు రాయల తెలంగాణ, మూడు నాయకత్వ మార్పిడి. భారీ ప్యాకేజీ పైన వెనక్కి తగ్గిందనే వార్తలు వచ్చినప్పటికీ పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దంటున్నారు. మరోవైపు అభివృద్ధి మండలి పైన కూడా చర్చిస్తున్నారట. తమకు రాజకీయంగా ఏది లాభిస్తే దానివైపు కాంగ్రెసు మొగ్గు చూపే అవకాశముంది.
కావూరి సాంబశివ రావు, జెడి శీలంలకు పదవులు ఇవ్వడం, కేబినెట్లో సీమాంధ్ర నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే వ్యూహంలో భాగమే అంటున్నారు. సీమాంధ్ర నేతలకు ఎక్కువ పదవులు ఇచ్చి వారిలో అసంతృప్తి స్థాయిని తగ్గించాలని భావిస్తోందని అంటున్నారు.
రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. విభజన ప్రకటన ద్వారా టిడిపిని ఇరుకున పెట్టడం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందవచ్చునని భావిస్తున్నదని అంటున్నారు.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం అంతగా లేదు. సీమాంధ్రలో మాత్రం బలంగా ఉంది. విభజన ప్రకటన ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా ఇరకాటంలో పడేయడం ద్వారా లబ్ధి పొందవచ్చునని భావిస్తోందని అంటున్నారు. అయితే ఒకే ప్రాంతానికి ఎక్కువగా పరిమితమైన జగన్ పార్టీకి ఇది లాభించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.
తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఈ ప్రాంతంలో తెరాస చాలా బలపడింది. బిజెపి కూడా తెలంగాణవాదం నెత్తికెత్తుకొని క్రమంగా బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విభజన ప్రకటన ద్వారా ఆ రెండు పార్టీలని మసకబార్చి తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోందని అంటున్నారు. సమైక్య సెంటిమెంట్ అంత బలంగా లేనందున సీమాంధ్రలోను పలు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని భావిస్తుండవచ్చునని అంటున్నారు.