పరిటాల శ్రీరామ్: ట్విస్టులు, అనుమానాలు
శ్రీరామ్ పైన కేసు పెట్టిన తర్వాత తొలుత బాధితుడు కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి తనకు, పరిటాల కుటుంబానికి ఎలాంటి ప్యాక్షన్ విభేదాలు, గొడవలు లేవని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తన తనయుడుపై కేసును తప్పుపట్టిన రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత కూడా పలుమార్లు దీనిని చెప్పారు. సుధాకర్ రెడ్డి కూడా తమకు, అతనికి మధ్య ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవని చెప్పినప్పటికీ శ్రీరామ్ పైన కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు.
అయితే అనుకోని విధంగా ఈ కేసును కామిరెడ్డిపల్లి మలుపు తిప్పారు! అప్పటి వరకు తనకు పరిటాల కుటుంబంతో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవని చెప్పిన కామిరెడ్డిపల్లి మూడు రోజుల క్రితం పరిటాల కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ధర్మవరం డిఎస్పీని ఆశ్రయించారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట గొడవలు లేవని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత ప్రాణహానీ ఉందని ఎలా కేసు పెట్టారని అంటున్నారు.
మరోవైపు పరిటాల శ్రీరామ్ ఎక్కడున్నాడో కూడా అంతుచిక్కకుండా ఉంది. వారం రోజుల క్రితం పోలీసులు అతని కోసం పరిటాల ఇంటిని, బంధువులు, స్నేహితుల ఇంటిని జల్లెడ పట్టారు. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదు. కేసు పెట్టిన రోజు పరిటాల సునీత మాట్లాడుతూ... నూతన సంవత్సర వేడుకల కోసం శ్రీరామ్ బయటకు వెళ్లారని, ఇంకా రాలేదని చెప్పారు. అయితే ఇది గడిచి ఆరేడు రోజులు అయినప్పటికీ శ్రీరామ్ ఇంకా తిరిగి రాలేదు. కానీ పోలీసులు మాత్రం అతని కోసం గాలిస్తూనే ఉన్నారు.
ఇటీవలే పరిటాల శ్రీరామ్ ధర్మవరం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది మొదట ఈ రోజుకు(7-01-2013) వాయిదా పడింది. అనంతరం ఈ రోజు నుండి రేపటికి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ వస్తే పరిటాల శ్రీరామ్ అజ్ఞాతం వీడే అవకాశాలు ఉన్నాయి. కామిరెడ్డిపల్లి మాట మార్చడం, పరిటాల శ్రీరామ్ అజ్ఞాతంలో ఉండటం ఇప్పుడు జిల్లాలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.