కమల్ విశ్వరూపం సక్సెస్: జయలలిత రాంగ్?
చెన్నై: తమిళనాడులో విడుదల రెండు వారాలు ఆలస్యంగా జరిగినప్పటికీ కమల్ హాసన్ విశ్వరూపం సినిమా ఘన విజయం సాధించింది. సినిమాలో ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే దృశ్యాలున్నాయంటూ వివాదం చెలరేగింది. తమిళనాడు ముస్లిం సంఘాలు సినిమాపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం సినిమాపై నిషేధం పెట్టింది. అయితే, జయలలిత కారణంగానే విశ్వరూపం సినిమాకు కమల్ హాసన్ సొంత రాష్ట్రం తమిళనాడులో ఇబ్బందులు ఏర్పడ్డాయనేది అందరూ ఇప్పటికీ నమ్ముతున్నారు.
కేంద్ర మంత్రి పి. చిదంబరానికి అనుకూలంగా మాట్లాడినందుకు జయలలిత కమల్ హాసన్పై కత్తులకు పదను పెట్టి, అదను చూసి దెబ్బ తీసే ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి. అయితే, సినీ రంగమంతా కదిలి రావడంతో వివాదానికి ఓ పరిష్కారం లభించింది. ముస్లిం సంఘాల నాయకులతో కమల్ హాసన్ చర్చలు జరిపారు. ఈ చర్చలకు జయలలితనే వెసులుబాటు కల్పించారని అంటారు.
తమిళనాడులో విశ్వరూపం విడుదల ఆగిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఒక రోజు అటూ ఇటుగా సినిమా విడుదలైంది. తమిళనాడులో సినిమా విడుదలైన తర్వాత రెండు రోజులకే 120 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అంచనా. హిందీలో కూడా విశ్వరూపం సినిమా బాగా ఆడుతోంది. జయలలిత తప్పు చేశారని సినిమా విజయం తెలియజేస్తోందని అంటున్నారు.

కమల్ హాసన్ 96 కోట్ల రూపాయలు వెచ్చించి విశ్వరూపం సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు కమల్ హాసన్ కథ రాసుకున్నాడు. అతనే నిర్మాతగా డబ్బులు కుమ్మరించాడు. సినిమాలో రాహుల్ బోస్, శేఖర్ కపూర్, పూజా కుమార్లతో కలిసి నటించాడు.
తన సొంత రాష్ట్రం తమిళనాడులోనే తన సినిమాకు ఆటంకాలు ఏర్పడడంతో కమల్ హాసన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపిస్తున్నారు. ఆయన తన ఆవేదనను వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. అయితే, తమిళనాడులో సినిమా విజయం సాధించడం ఆయకు ఊరటనిచ్చే విషయమే.












Click it and Unblock the Notifications