విభజన: రాజీనామాల దిశగా కిరణ్ నడిపిస్తారా?
సీమాంధ్రకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తమ రాజీనామాలు ఆమోదం పొందేలా చూడాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. అదే విధంగా గవర్నర్ నరసింహన్ను కూడా కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరారు. అయితే, రాజీనామా లేఖలు తన వద్దకు రాలేదు కాబట్టి తాను ఏమీ చేయలేనని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఆ తర్వాతనే ఆ ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి తమ రాజీనామాలను ఆమోదం కోసం గవర్నర్కు పంపించాలని కోరారు. అయితే, కొంత కాలం ఆగాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. తగిన సమయంలో అందరం కలిసే నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి తమకు చెప్పినట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి పార్టీ అధిష్టానాన్ని కలిసి చివరిసారిగా సమైక్యాంధ్రకు అనుకూలంగా తమ అభిప్రాయం వినిపిస్తారని, అప్పటికి కూడా అధిష్టానం తమ మాట వినకుండా రాష్ట్ర విభజనకు ముందుకు సాగితే రాజీనామాలు చేయాలనే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. సీమాంధ్ర మంత్రులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధపడతారని, అందుకు ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారని అంటున్నారు.