ఎన్నికల వ్యూహం: గుజరాత్ బీజేపీలో ‘పాటిదార్ల’ పాట
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని భూస్వాములైన పాటేదార్/ పటేళ్లను మళ్లీ మంచి చేసుకునేందుకు అధికారంలో ఉన్న బీజేపీ మంగళవారం నుంచి భారీ కసరత్తు చేపట్టనున్నది.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని భూస్వాములైన పాటేదార్/ పటేళ్లను మళ్లీ మంచి చేసుకునేందుకు అధికారంలో ఉన్న బీజేపీ మంగళవారం నుంచి భారీ కసరత్తు చేపట్టనున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హార్ధిక్ పటేల్ ఆధ్వర్యంలో పటేల్ కమ్యూనిటీ పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన చేపట్టిన హింసాత్మకం కావడంతో ఆ సామాజిక వర్గం పాలకపక్ష బీజేపీకి బాగా దూరమైన విషయం తెల్సిందే.
గుజరాత్ ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు సొంత రాష్ట్రం. ప్రత్యేకించి అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన రాష్ట్రం కూడా. రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టిన పటేళ్లపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసిన ఘనత గుజరాత్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానిది. అప్పట్లో సీఎంగా ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. అధికార పక్షంలోని వారే పటేళ్ల ఆందోళనకు కొమ్ము కాశారని విమర్శలు ఉన్నాయి. తర్వాతీ కాలంలో ఆందోళనకు దిగిన పటేళ్లు బయటకు వెళితే ఇంటికి సురక్షితంగా చేరతారా? లేదా? అన్న ఆందోళన కర పరిస్థితులు గుజరాత్ రాష్ట్రంలో నెలకొన్నాయి.
అంతెందుకు పటేళ్ల ఆందోళనకు సారథ్యం వహించిన హార్దిక్ పటేల్ను ఆరు నెలల పాటు రాష్ట్రం ఆవల రాజస్థాన్లో ఉండేలా ఆదేశాలు జారీ చేసిన ఘనత ఈ సర్కార్ది. తర్వాత మారిన పరిస్థితుల్లో ఆనందీబెన్ పటేల్ను గద్దె దింపి, విజయ్ రూపానీని సీఎంగా నియమించారు. తాజాగా మంగళవారం నుంచి పటేళ్లతో అనుసంధానానికి జరిగే ఈ కార్యక్రమానికి మాస్టర్ పార్టీ వ్యూహకర్తగా పేరు మోసిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ మాజీ సీఎం ఆనంది బెన్ పటేల్ దూరంగా ఉండనున్నారు.
బీజేపీ భేటీకి హార్దిక్ పటేల్ దూరం
ఎన్నికలకు ముందు పటేళ్లను మళ్లీ పార్టీలో భాగస్వామ్యం చేయడానికి సెప్టెంబర్ 26వ తేదీన ఎంపిక చేసిన పటేల్ నాయకులతో గాంధీనగర్లో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశానికి హార్ధిక్ పటేల్ను పిలవక పోవడం గమనార్హం. ఇటీవలే హార్దిక్ పటేల్ ‘ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ' ఏజంట్ గా వ్యవహరిస్తున్నారని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఆరోపించారు మరి. హార్దిక్ పటేల్ కూడా తక్కువ తినలేదు. నితిన్ పటేల్ను ‘అమిత్ షా' ఏజంట్ అని హార్దిక్ పటేల్ అభివర్ణించారు. అది వేరే సంగతి. ఇక రాష్ట్రంలో నిర్వహించనున్న రెండు ర్యాలీలకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ రెండు ర్యాలీలకు డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితూభాయ్ వఘానీలు నాయకత్వం వహించనున్నారు. వీరిరువురు కూడా పటేల్ సామాజిక వర్గ నాయకులే ఆసక్తికర పరిణామం.
Recommended Video
పోర్ బందర్ నుంచి రెండో యాత్ర
మొదటి యాత్ర సర్ధార్ పటేల్ జన్మస్థలమైన కరమ్సద్ నుంచి అక్టోబర్ ఒకటో తేదీన, రెండవ యాత్ర అక్టోబర్ రెండవ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్బందర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రెండు యాత్రలు కూడా పటేళ్లు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల గుండా సాగి అక్టోబర్ 15వ తేదీన ముగుస్తాయి. మంగళవారం గాంధీనగర్లో జరుగనున్న పటేళ్ల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపాని కూడా హాజరవుతున్నారు. వివిధ సామాజిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న పటేళ్ల కమ్యూనిటీ నాయకులు దాదాపు వందమంది రేపటి సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు.
అమిత్ షా పైకి కోడిగుడ్లు విసిరిన యువత
2016, సెప్టెంబర్ నెలలోనే పటేల్ కమ్యూనిటీని మళ్లీ హక్కున చేర్చుకునేందుకు సూరత్లో బీజేపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ప్రధాన వక్తగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడారు. కానీ అమిత్ షాకు వ్యతిరేకంగా పాటిదార్ యువత సమావేశంలో విధ్వంసం సష్టించి వేదికపైకి కుర్చీలు విసిరారు. షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో మారణకాండ సృష్టించిన బ్రిటిష్ సైనికాధికారి జనరల్ డయ్యర్తో ఆయన్ని పోల్చడంతో అమిత్ షా తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన గత మార్చి నెలలో అహ్మదాబాద్ నుంచి సోమ్నాథ్ వెళుతుండగా పటేళ్లు ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ సీఎంగా పదవి నుంచి ఆనందీబెన్ పటేల్ను తొలగించి ఆమె స్థానంలో అమిత్ షా విధేయుడైన విజయ్ రుపానీని నియమించారు.
పటేళ్ల సమీకరణకు అమిత్ షా దూరం
ఇదిలా ఉంటే ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో కమలనాథుల్లో ఆందోళన మొదలైంది. 2002 నుంచి వరుసగా, 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంటుందన్న సందేహాలు బీజేపీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే పటేళ్ల సమీకరణ కార్యక్రమానికి అమిత్ షా దూరంగా ఉన్నారు.