కెసిఆర్ సెంటిమెంట్ కత్తి: తెరవెనకే చంద్రబాబు?
హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీని తెర వెనక ఉండి మాత్రమే నడిపించాలని, తెర ముందుకు రాకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన తెలంగాణ తెలుగు తమ్ముళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. తాను తెర ముందుకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సెంటిమెంట్ను ముందుకు తెస్తారని, దానివల్ల ఆయనకే మేలు జరుగుతుందని చంద్రబాబు అంటున్నట్లు చెబుతున్నారు.
ఈ స్థితిలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రచారం చేయకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. తెలంగాణాలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోనని ఇటివల తెలంగాణ టిడిపి నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది.. దాంతో తెలుగు తముళ్ళు అయోమయంలో పడ్డారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారవుతుందని వారు అంటున్నట్లు తెలుస్తోంది.
బల్దియా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జత కడుతున్న టిడిపి ఎన్ని డివిజన్లలో పోటీ చేయాలి, ఏయే డివిజన్లలో పోటీ చేయాలి, అభ్యర్ధుల ప్రచారం, గెలుపు వ్యూహాలు తదితరాలన్నింటినీ పార్టీ తెలంగాణ నేతలే చూసుకోవాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి టిఆర్ఎస్ విషయంలో తాను జోక్యం చేసుకుంటే అనేక ఇబ్బందులొస్తున్నాయని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తానని అన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రచారం చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో టిడిపి ఉనికి కోసం పాకులాడుతున్నది. టిడిపి చెందిన పలువురు నేతలు ఇప్పటికే అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మరింత మంది చేరే అవకాశాలున్నాయి. దాంతో టిడిపి దాదాపు బలహీనపడిపోయింది.
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టిడిపి చావుదెబ్బ తిన్నది. జిహెచ్ఎంసి ఎన్నికలకు ఈ స్థితిలో వారికి అగ్నిపరీక్ష పెడుతున్నాయి. చంద్రబాబు మాత్రం జోక్యం చేసుకోకూడదనే భావిస్తున్నారు. తెలంగాణలో చురుకైన పాత్ర పోషిస్తే టిఆర్ఎస్ను లక్ష్యం చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ కారణాల వల్ల దానికి దూరంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో సంధి చేసుకున్న తర్వాత ప్రత్యక్షంగా ఆయనున్న విమర్శించేందుకు గాని ఆయనపై ఆరోపణలు చేయటానికి కానీ చంద్రబాబు ఇష్టపడటం లేదు. అదే సమయంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతూనే వీలైనంతగా టిడిపిని కెసిఆర్ దెబ్బ కొడుతున్నారు.
అయినా సరే కెసిఆర్ను చంద్రబాబు పల్లెత్తుమాట అనలేకపోతున్నారనే బాధ తెలంగాణ టిడిపి నేతలను వేధిస్తోంది. ఇంత కాలం జిహెచ్ఎంసి ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తారని టిడిపి తెలంగాణ నేతలు అనుకుంటున్నారు. ఈనెల 9వ తేదీన జిహెచ్ఎంసి పరిధిలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు చంద్రబాబు అధ్యక్షత వహిస్తారని తముళ్ళు ప్రచారం చేస్తున్నారు. బల్దియా ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ప్రచారం చేస్తారని తముళ్ళు శ్రేణులకు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు పాల్గొనడం సందేహంగానే ఉంది.
అదే సమయంలో గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కెసిఆర్ పావులు కదుపుతూ వస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రచారం చేస్తానని కెసిఆర్ పార్టీ నేతలకు స్వయంగా చెప్పారు. ఈ నేపధ్యంలో ఒకే ప్రాంతంలో ఇటు కెసిఆర్ అటు చంద్రబాబు పరస్పరం ఢీ కొంటే అది కెసిఆర్కే మేలు జరుగుతుందని చంద్రబాబు తముళ్ళకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి పరిస్థితి గందరగోళంగా మారిందని అంటున్నారు.