లెఫ్ట్ అనుమానాలు: బిజెపితోనే చంద్రబాబు!
న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్లు వామపక్షాలు భావిస్తున్నాయి. చంద్రబాబుతో చర్చించిన సమయంలో ఈ విషయం స్పష్టమైనట్లు ఓ కమ్యూనిస్టు నాయకుడు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా చంద్రబాబు ఎన్డీఏకు దగ్గరవుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్లు కలిసిపోయే అవకాశం ఉందని, అలాగే సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. దీంతో చంద్రబాబుకు వామపక్షాలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మూడో కూటమి వైపు ఆసక్తి ప్రదర్శించిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు వామపక్షాలు భావిస్తున్నాయి.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లయితే బిజెపికి చాలా తక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టబడి ఉన్నామంటున్న బిజెపితో పొత్తు పెట్టకుని సీమాంధ్ర ప్రజల ముందుకు వెళ్లడం బాబుకు ఒక సవాల్ అని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి కావడం వల్ల రాష్ట్రంలో కూడా యువత బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు, రాష్ట్రంలో కాంగ్రెసును దెబ్బ తీసేందుకు బిజెపి తమకు తక్కువ సీట్లు కేటాయించినా అంగీకరిస్తుందనే అభిప్రాయంతో చంద్రబాబు వైఖరి మారినట్లు భావిస్తున్నారు.
కాగా సోమవారం జరిగిన జాతీయ సమగ్రతా మండలి(ఎన్ఐసీ) సమావేశం నుంచి వాకౌట్ చేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదని అంటూ ఎన్డీఏతో పొత్తు విషయాన్ని మీడియా ప్రస్తావించగా దాటవేశారు. 2002 గుజరాత్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారా? అని మీడియా ప్రశ్రించగా..ఈ విషయాలపై తర్వాత మాట్లాడతానని చెప్పారు. కేంద్రంలో ఇంతకముందు కాంగ్రెసేతర పార్టీల పాలనలో టిడిపి కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు గుర్తు చేశారు.