స్పీకర్ టు సిఎం: కిరణ్ మొండిఘటమా? ముళ్లపీఠంపై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లుకు లోకసభ ఆమోదం తెలపడం, రాజ్యసభలో ఈ రోజు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆయన బుధవారం ఉదయం గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ ఏ మంత్రి పదవి చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కించుకున్నారు. తన తండ్రి తర్వాత కిరణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. వైయస్ అండతో స్పీకర్ అయ్యారు. ఆయన మృతి తర్వాత రోశయ్య బాధ్యతలు చేపట్టినా ఆయన తప్పుకున్న తర్వాత కిరణ్ సిఎంగా బాధ్యతలు చేపట్టారు.

స్పీకర్ టు సిఎం
కిరణ్ కుమార్ రెడ్డి 2010 నవంబర్ 25వ తేదిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం తర్వాత అప్పటి ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. వయస్సు, పార్టీలో అందరి నుండి సహకారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి కిరణ్ ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఓ విధంగా చెప్పాలంటే కిరణ్ కూర్చునే నాటికి సిఎం పీఠం ముళ్లపీఠమనే అభిప్రాయం అందరిలోను ఉంది. అప్పటికే జోరందుకున్న తెలంగాణ ఉద్యమానికి తోడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దానికి తోడైంది. పలువురు సీనియర్లు సంక్షేమ పథకాల అమలు కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కిరణ్ దాదాపు మూడేళ్ల మూడు నెలల పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.
సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేశామని కిరణ్, ఆయన వర్గం చెబుతుంటే, వ్యతిరేక వర్గం, ప్రతిపక్షాలు మాత్రం ప్రచార ఆర్భాటమే తప్ప ఏమీ లేదని విమర్శలు గుప్పించాయి. ఏది ఏమైనా కిరణ్ ముళ్ల పీఠం పైనే కూర్చున్నారని చాలామంది అభిప్రాయపడ్డారు.
తెలంగాణ, మంత్రులు... మొండిఘటమా?
కిరణ్ మొండిఘటమా? అంటే ఆయన మాటలు, చేతలను బట్టి అవుననే అంటున్నారు. తెలంగాణ విషయంలో, మంత్రుల విషయంలో ఆయన ముక్కుసూటిగా మాట్లాడటమే కాకుండా తాను అనుకున్నది చేస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సభల్లో తెరాసను, కెసిఆర్ను, బిజెపిని సవాల్ చేశారు. సకల జనుల సమ్మెను, మిలియన్ మార్చ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే కితాబు అందుకున్నారు.
సభలో తెలంగాణవాదులు నిరసన తెలిపినా వేలమంది ఉన్నచోటకు పదిమంది వచ్చి రాద్దాంతం చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పాలనాపరంగా పార్టీల వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. తెలంగాణ విషయంలో మాత్రం సీమాంధ్రుల్లో హీరో కాగా, తెలంగాణకు విలన్ అయ్యారు. మంత్రులు శంకర రావు, డిఎల్ రవీంద్రా రెడ్డిల విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆర్టీఐ కమిషనర్ల నియామకం, ఇటీవల ఎమ్మెల్సీల విషయంలో కిరణ్ గవర్నర్ నరసింహన్తో ఢీ కొట్టారు.
అధిష్టానంతోను...
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతోనే తాను ముఖ్యమంత్రిగా అయ్యానని కిరణ్ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే, తెలంగాణ విషయంలో మాత్రం ఆయన అధిష్టానంతోనే ఢీకొన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. అధిష్టానం పెద్దల ముందు, బహిరంగంగా, ప్రెస్ మీట్లలో కిరణ్ అధిష్టానాన్ని సవాల్ చేశారు.
విభజన విషయంలో తప్ప తాను అధిష్టానానికి అన్ని విషయాల్లో అనుకూలమని చెప్పారు. విభజన విషయంలో అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కిరణ్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇప్పటికీ కొత్త పార్టీపై ఉత్కంఠ వీడలేదు.












Click it and Unblock the Notifications