నంద్యాల పోరు: చంద్రబాబు కలవరం, ఎందుకు?
నంద్యాల ఉప ఎన్నిక సంగతి వేరే. ఇది అభ్యర్థుల పోటీ కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ప్రతిపక్షనేత వైయస్ జగన్కు మధ్య పోటీగా ముందుకు వచ్చింది.
కర్నూలు: నంద్యాల శాసనసభ సీటు బరిలో తెలుగుదేశం పార్టీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నిజానికి, ఓ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతుందంటే అది అధికార పక్షానికి గానీ, విపక్షానికి గానీ అంత ముఖ్యమైన విషయం కాదు.
కానీ, నంద్యాల ఉప ఎన్నిక సంగతి వేరే. ఇది అభ్యర్థుల పోటీ కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ప్రతిపక్షనేత వైయస్ జగన్కు మధ్య పోటీగా ముందుకు వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు దానికి కారణం.
వచ్చే ఎన్నికల్లో ఎపిలో పాగా వేయాలని జగన్, అధికారాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. నంద్యాల ఫలితం ఆ విషయంలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో జయాపజయాలకు సంకేతంగా నంద్యాల ఫలితాన్ని భావిస్తున్నారు. అందుకే, దాన్ని చంద్రబాబు, జగన్ మధ్య పోరుగానే పరిగణిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో ఇలా....
నంద్యాలలో అంతా బాగుందని తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నివేదికలు అందుతున్నాయ. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అంత సజావుగా లేదని అంటున్నారు. అయితే, పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎత్తులకు పైయెత్తులు వేసే పనిలో తెలుగుదేశం నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఫిరాయింపుదారు కావడం వల్ల....
భూమా నాగిరెడ్డి గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన అకాల మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. సాంకేతికంగా చూస్తే ఆ సీటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీది. కానీ, సంప్రదాయం ప్రకారం తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని టిడిపి కోరింది. కానీ జగన్ ససేమిరా అన్నారు. పోటీకి సై అన్నారు. టిడిపి నుంచి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చి పోరుకు సిద్ధపడ్డారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతే టిడిపికి పెద్ద నష్టమేమీ ఉండదు గానీ చంద్రబాబు నైతికతపై ప్రశ్నల వర్షం కురుస్తుంది.
ఫిరాయింపుదారుల కారణంగా..
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే, వైసిపి నుంచి టిడిపిలో చేరిన మిగతా ఎమ్మెల్యే విషయంలో జగన్ చేస్తున్న వాదనకు బలం చేకూరుతుంది. వారిచేత రాజీనామాలు చేయించి, తిరిగి పోటీ చేయించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఓడిపోతారనే భయంతోనే చంద్రబాబు వారి చేత రాజీనామాలు చేయించడం లేదని వైసిపి విమర్శలు గుప్పిస్తోంది. నంద్యాలలో టిడిపి ఓడిపోయి, తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే వైసిపి గొంతు మరింత పెంచే అవకాశం ఉంది. దానికితోడు, జగన్కు నైతిక బలం చేకూరుతుంది.
వచ్చే ఎన్నికల విషయంలో....
నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామనే ధీమా జగన్లో పెరిగే అవకాశం ఉంది అదే సంకేతాలను ప్రజలకు చేరవేయడానికి కూడా ఆయనకు అవకాశం ఉంటుంది. చంద్రబాబుకు ఆ విషయంలో అవరోధం ఏర్పడుతుంది. మందీమార్బలాన్ని, ఎమ్మెల్యేలను మోహరించినప్పటికీ విజయం సాధించకపోతే చంద్రబాబు సత్తా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఆయన కలవరం చెందుతున్నట్లు భావిస్తున్నారు.
వీల్ చైర్పై ఎస్పీవై రెడ్డి...
నంద్యాల పార్లమెంటు సీటు నుంచి ఎస్పీవై రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, గత కొంత కాలంగా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంంటున్నారు. నంద్యాల అసెంబ్లీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆయన బయటకు వచ్చారు. వీల్ చైర్ మీదనే ఆయన టిడిపి అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో విశ్వాసం సన్నగిల్లడం వల్లనే ఆయన అలాంటి పరిస్థితిలో కూడా ప్రచారం కోసం ముందుకు రావాల్సి వచ్చిందని అంటున్నారు.