టిడిపిVsబిజెపి: పవన్-నాగార్జునలతో గేమ్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లే కుదిరి బెడిసి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల విషయంలో ఇరు పార్టీలు పట్టు వీడటం లేదు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐల మధ్య కూడా పొత్తు దోబూచులాటలా మారింది. ఆయా పార్టీలు సీట్ల విషయంలో పైచేయి కోసం పరితపిస్తున్నాయి. టిడిపి, బిజెపి మధ్య పొత్తులాట రసకందాయంలో పడింది. వస్తే రండి... పోతే పొండి అంటూ రెండు పార్టీలూ సంకేతాలు పంపుతున్నాయి.
బిజెపి బలమెంతో చూసుకొని సీట్లు అడగాలని తెలుగుదేశం చెబుతుండగా... నాటికి నేటికి తమ బలం పెరిగిందని, అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే రెండు ప్రాంతాల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ముందుకువెళ్లాలని బిజెపి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండురోజుల్లోనే అంతిమ నిర్ణయం తీసుకోవాలని బిజెపి భావిస్తోంది.
సీమాంధ్రలో నుంచి 20 అసెంబ్లీ, 5 లోకసభ తెలంగాణలో 50 అసెంబ్లీ, 9 లోకసభ సీట్లు ఇస్తే తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరించవచ్చునని బిజెపి జాతీయ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేకుంటే టిడిపికి గుడ్ బై చెప్పాలని యోచిస్తోందట. ఇదే క్రమంలో టిడిపిపై ఒత్తిడి పెంచే వ్యూహాలనూ అమలు చేస్తోందంటున్నారు.
బిజెపి - టిడిపి
పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి ప్రముఖులు మోడీతో భేటీ కావడం టిడిపిపై ఒత్తిడి పెంచేందుకు బిజెపి వ్యూహంలో భాగమే కావచ్చునని అంటున్నారు.
బిజెపి - టిడిపి
పవన్ కళ్యాణ్, నాగార్జున తదితరుల సహకారం, లోక్సత్తాతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగడం ఉత్తమమని బిజెపిలో పలువురు భావిస్తున్నారు. ఇక పొత్తుల విషయం స్థానిక నేతలకు వదిలివేయాలని, ఢిల్లీ పెద్దలు తమ నిర్ణయాన్ని రుద్దవద్దని ఉభయ ప్రాంతాల నేతలు ఒత్తిడి తెస్తున్నారట.
బిజెపి - టిడిపి
టిడిపితో పొత్తు వద్దని తెలంగాణ నేతలు చెబుతుండగా... ఉంటేనే మంచిదని సీమాంధ్ర నాయకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మధ్యేమార్గంగా అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే పొత్తును వదులుకోవడానికి సిద్ధం కావాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బిజెపి - టిడిపి
మరోవైపు తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఆర్ఎస్ఎస్కు కొన్ని అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతోనే పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించి, మోడీ వద్దకు పంపించారని సమాచారం.
టిడిపి
ఎన్నికల ముందు వీలైనంతగా బలపడి ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా టిడిపి కదులుతోంది. అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలకు తలుపులు తెరిచి ఉంచుతోంది.
టిడిపి
ఇతర పార్టీల నుంచి చేరికలు శ్రుతిమించాయన్న విమర్శలకు టిడిపి సమాధానమిస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని, విభజన వ్యవహారంలో కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించిందన్న అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో నెలకొందని, దీంతో ఆ పార్టీలోని నాయకులంతా దాని నుంచి బయట పడాలని చూస్తున్నారని, తెలుగుదేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు.
జగన్ - కిరణ్
జగన్పై నమ్మకం పోయిందని, కిరణ్ పార్టీకి ఊపు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో తాము తలుపులు మూసివేస్తే అనివార్యంగా బిజెపి వైపు చూస్తారని, దీంతో కాంగ్రెస్ స్థానంలో మరో పార్టీ పెరగడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టిడిపి వర్గాలు చేరికలపై చెబుతున్నాయంట.