పడుకోవట్లేదు!: (కెసిఆర్ ఫాంహౌస్ పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం కొత్తగా కనిపించారు! పదమూడేళ్లుగా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న కెసిఆర్ అప్పుడప్పుడు మెదక్ జిల్లాలోని తన ఫాం హౌస్కు వెళ్లి వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తుంటారు. కెసిఆర్ ఎప్పుడు ఫాం హౌస్లో పడుకుంటారని టిటిడిపి నేతలు, ఇతర నాయకులు ఎద్దేవా చేస్తారు కూడా. గురువారం కెసిఆర్ ఫాంహౌస్లో వ్యవసాయ పనులు చేస్తూ కనిపించారు.
వ్యవసాయం అంటే రైతును ఆత్మహత్యలకు ప్రేరేపించే వృత్తి కాదు... రైతుకు సంపద వర్షం కురిపించే సంస్కృతి అని కెసిఆర్ అన్నారు. ఆయన విలేఖరులను తీసుకు వెళ్లి మరీ తన పొలాన్ని చూపించారు. కెసిఆర్ పొలం కరీంనగర్ జాతీయ రహదారి నుంచి చిన్న పల్లెల గుండా వెళితే ములుగు మండలంలో ఎర్రవెల్లి అనే చిన్న గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో మొత్తం 60 ఎకరాల్లో కెసిఆర్ పంట పండిస్తున్నారు.
ఉద్యమ విత్తనాలు చల్లి తెలంగాణ పంట పండించడంలో బిజీగా ఉన్న తాను వ్యవసాయ పంటను లాభసాటిగా మార్చే ప్రయోగాన్ని సైతం నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. అప్పుడు చేతిలో పడే సొమ్ము ఏడు నుంచి పది కోట్ల రూపాయల వరకు ఉంటుందట. సరైన ప్రణాళికతో వ్యవసాయం సాగిస్తే కచ్చితంగా లాభాల పంట పండుతుందని, అయితే దీనికి ప్రభుత్వం నుంచి రైతులకు సరైన ప్రోత్సాహం అవసరం అని కెసిఆర్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నుండి తెలంగాణ బిల్లు పైన చర్చ నేపథ్యంలో రాజకీయంగా వేడి ఉన్నప్పటికీ కెసిఆర్ కూల్గా కనిపించారు.

కెసిఆర్ 1
కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో పడుకుంటున్నారని రాజకీయ ప్రత్యర్థులు పదే పదే విమర్శలు చేస్తుండడంతో కెసిఆర్ గురువారం నాడు మీడియాను ఫామ్ హౌస్కు ఆహ్వానించారు.

కెసిఆర్ 2
శుక్రవారం నుంచి శాసన సభలో తెలంగాణ అంశంపై వాడిగా వేడిగా చర్చ సాగనున్న సమయంలో కెసిఆర్ మాత్రం కూల్గా మీడియాతో పాటు పంట పొలాల్లో తిరుగుతూ వ్యవసాయం లాభసాటిగా ఎలా మార్చవచ్చో వివరించారు.

కెసిఆర్ 3
ముంబై, ఢిల్లీ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే రంగురంగుల క్యాప్సికం (బెంగళూరు మిర్చి), ఆలుగడ్డల పంట పండిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 60 ఎకరాల పొలం తీసుకున్నా గత ఏడాది వరకు దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడానికి సమయం గడిచిపోయిందని, ఈ ఏడాది 10 ఎకరాల్లో రంగు రంగుల క్యాప్సికం పంట, 46 ఎకరాల్లో ఆలుగడ్డల పంట వేసినట్టు తెలిపారు.

కెసిఆర్ 4
ఈ రెండు పంటల ద్వారా ఈ సంవత్సరం ఏడు నుంచి పది కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. గ్రీన్ హౌస్లలో క్యాప్సికం పంటను వేయడం వల్ల బాగా పండుతోందని చూపించారు.

కెసిఆర్ 5
ఒక కన్సల్టెంట్ను పెట్టుకొని ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే కచ్చితంగా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతం సమశీతోష్టస్థితి గల ప్రాంతమని, గ్రీన్ హౌస్ ద్వారా వ్యవసాయం చేయడం తెలంగాణ వాతావరణానికి అనుకూలం అని తెలిపారు.

కెసిఆర్ 6
గ్రీన్ హౌస్లో వ్యవసాయం చేయడానికి హర్యానా లాంటి రాష్ట్రంలో 75 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపారు.

కెసిఆర్ 7
సరైన వాటర్ మెనేజ్మెంట్ విధానాన్ని పాటించి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లాభసాటిగా వ్యవసాయం చేయవచ్చునని అన్నారు. సోలార్ విద్యుత్కు సైతం ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

కెసిఆర్ 8
ఈ వ్యవసాయ క్షేత్రంపై ఆధారపడి మొత్తం 23 కుటుంబాలకు చెందిన 60 మంది అక్కడే నివసిస్తున్నట్టు కెసిఆర్ తెలిపారు. తనకు గతంలో రంగారెడ్డి జిల్లా కందుకూరులో వ్యవసాయ క్షేత్రం ఉండేదని, టిఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో అది అమ్మేసి ఇంటిని నిర్మించినట్టు తెలిపారు.

కెసిఆర్ 9
తన తండ్రి వ్యవసాయదారుడని తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై ఆసక్తి ఉందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చవచ్చో తెలంగాణ రాష్ట్రం చేసి చూపిస్తుందన్నారు.

కెసిఆర్ 10
తన వ్యవసాయ క్షేత్రంలో మోటారు సైకిల్ నడుపుతున్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ దృశ్యం. తెలంగాణ ఆవిర్భావం
తరువాత ఈ క్షేత్రంలోనే ఆయాత చండీయాగం నిర్వహించాలని కెసిఆర్ భావిస్తున్నారట.

కెసిఆర్ 11
త్వరలో ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని కెసిఆర్ చెప్పారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలోని తన ఫామ్హౌస్లో కేసీఆర్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కెసిఆర్ 12
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై కేవలం రైతులకే కాకుండా, యువతకు, విద్యార్థులకు విశ్వాసం కలిగేలా చేస్తామని చెప్పారు.

కెసిఆర్ 13
తెలంగాణలో సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, నాలుగు (ఎర్ర, నల్ల, తేలికపాటి, ఇసుక) రకాల నేలలు, సరిపడా వర్షపాతం ఉన్నందున.. విద్యార్థులు సైతం వ్యవసాయంలో అడుగుపెట్టేలా ఆ రంగానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

కెసిఆర్ 14
ప్రస్తుత ప్రభుత్వాలు గ్రీన్ హౌస్ సాగుకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదని కేసీఆర్ విమర్శించారు. తాము మాత్రం గ్రీన్ హౌస్ సాగును బాగా ప్రోత్సహిస్తామని వెల్లడించారు.

కెసిఆర్ 15
ఇందుకోసం తెలంగాణలోని 10 జిల్లాల్లో జిల్లాకు 20 చొప్పున 200 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా గ్రీన్హౌస్ సాగును అమలు చేయిస్తామని చెప్పారు.

కెసిఆర్ 16
"ఇక్కడి వాతావరణ పరిస్థితులు విత్తన ఉత్పత్తికి అనుకూలం. రాష్ట్ర విభజన జరిగితే విత్తన ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్గా నిలుస్తుంది. ఈ విషయాన్ని వ్యవసాయ రంగ నిపుణులే చెబుతున్నార''ని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications