శషబిషలు: రాహుల్ నాయకత్వానికి చరమగీతం
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి రాహుల్ తప్పుకుని సన్యాసం పుచ్చుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు.
న్యూఢిల్లీ: పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దరిమిలా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలు క్రమంగా పెరుగుతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘోర పరాజయానికి తోడు అతిపెద్ద పార్టీగా అవతరించిన గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించిన సాచివేత ధోరణి, నాయకత్వ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీలో చురుకుదనం లేమి ఫలితమే ఈ అద్వాన్న పరిస్థితులకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీని ఫలితంగా ఆయన నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు.
రేణుకాచౌదరి మొదలు సత్యవ్రత్ చతుర్వేది.. సందీప్ దీక్షిత్ నుంచి రాజ్ బబ్బర్ వరకూ ప్రతి ఒక్కరూ ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ నేత నరేంద్రమోదీ ప్రధానిగా బాద్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఆబాల గోపాలానికి ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రజలందరికీ ఆరాధ్యనీయ నేతగా మారిపోయారు. దేశమంతటా కాంగ్రెస్ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం బీజేపీ జాబితాలో చేరిపోతున్నది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి రాహుల్ తప్పుకుని సన్యాసం పుచ్చుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు.
కాంగ్రెస్ యువనేత తీరిది..
ఎన్నికల్లో అనుసరిస్తున్న తీరు, ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి అనుసరించాల్సిన వ్యూహం రూపొందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. గాంధీయేతర నాయకుడికి పార్టీ నాయకత్వం వహిస్తే మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంతా తానై వ్యవహరిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు పార్టీ నాయకత్వం ఇతరులకు అప్పగిస్తే మంచిదని సూచించారు.
సత్యవ్రత్ చతుర్వేది ఇలా
‘పార్టీ నాయకత్వంలో మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని మేం వింటున్నాం. కానీ అటువంటిదేమీ జరుగడం లేదు. అదే కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంచిది' కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సత్యవ్రత్ చతుర్వేది వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి రాజకీయాలు తెలిసిన వారే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉండటం సబబుగా ఉంటుంది' అని సత్యవ్రత్ చతుర్వేది అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన దిశను మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఇది ఒక పెద్ద అపజయం అని తాను భావించడం లేదని, తాము మళ్లి వెనుదిరిగి వస్తామని పేర్కొన్నారు.
రాహుల్ నాయకత్వంపై సందీప్ దీక్షిత్ ఇలా
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా పార్టీ నాయకత్వంలో మార్పు అవసరమని సూచించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో ఎన్డీటీవీ చానెల్తో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ ‘పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి నేను రాహుల్ గాంధీని కాదు. సందీప్ దీక్షిత్ను' అని వ్యాఖ్యానించారు.
డిగ్గీరాజాపై రేణుకా చౌదరి ఇలా
గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించిన విధానం తెలివితక్కువ తనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. పార్టీ గోవా వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ మూర్ఖత్వం వల్లే ఇదంతా జరిగిందని ఆమె మండిపడ్డారు. తక్షణం ఆయనను పార్టీ గోవా ఇన్ చార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గోవాలో 40 స్థానాల అసెంబ్లీలో 17 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నా ప్రభుత్వ ఏర్పాటు చేయలేకపోయింది. ఇదే దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ యావత్తు గాంధీ - నెహ్రూ కుటుంబంపై ఆధారపడి ఉన్నదని, ప్రస్తుతం రాహుల్ నాయకత్వంలో పని చేస్తున్నదన్నారు.
రాహుల్పై రాజ్ బబ్బర్ ఇలా
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ సైతం నాయకత్వం పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని సుతిమెత్తగా చెప్పారు. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించలేమంటూనే పూర్తిస్థాయిలో పునర్యవస్థీకరించాలని తేల్చి చెప్పారు.
గోవాలో దిగ్గీరాజా వైఫల్యమే..
గోవాతోపాటు మణిపూర్లో 60 స్థానాల అసెంబ్లీలో 28 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలాన్ని అందుకోవడంలో విఫలమైంది. గోవాలో కేంద్ర రక్షణశాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్, మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత.. బీజేపీ ఎమ్మెల్యే బీరేన్ సింగ్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.
ఇదీ కాంగ్రెస్ పార్టీ దుస్థితి
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కుటుంబాన్ని జాతీయ రాజకీయాల నుంచి పూర్తిగా తొలగించేందుకు కమలనాథులు కంకణం కట్టుకున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ వరుస వైఫల్యాల్లో చిక్కుకుని సతమతం అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ దుస్థితి పంటలు పండక, రుణాల ఊబిలో చిక్కుకున్న రైతు కుటుంబం పరిస్థితిని తలపిస్తున్నది. కానీ వీర విధేయులు మాత్రమే ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారే తప్ప. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు శుభం కార్డు వేసి సన్యాసం పుచ్చుకుంటే మంచిదన్న సలహాలు వినవస్తున్నాయి.
మోదీ వచ్చిన తర్వాత తిరగబడ్డ జాతీయ రాజకీయం
2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించినప్పుడే కాంగ్రెస్ పార్టీ పతనానికి మార్గం సుగమమైందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాని మోదీ పనితీరును ఆయన వ్యతిరేకులు సైతం మెచ్చుకునే స్థాయిలో ఆబాల గోపాలంలో ‘మోదీ హవా' హోరెత్తుతున్నది. యావత్ భారతానికి ప్రత్యేకించి యువతరానికి ఆకర్షణీయమైన నేతగా మోదీ నిలిచారంటే అతిశేయోక్తి కాదు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు మోదీ. ఉత్తర భారతం మొదలు ఈశాన్యం... తూర్పు దిశ నుంచి పశ్చిమ దిశకు అడుగడుగునా మోదీ ప్రభంజనం వీస్తోంది. ఈ తరుణంలోనే దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ రాజకీయాలను తిరస్కరిస్తున్నారు.