రాష్ట్ర విభజనపై కిరణ్ రెడ్డి లేఖాస్త్రం: ముఖ్యాంశాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తీరును తప్పు పడుతూ ప్రధాని మన్మోహన్ సింగ్కు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. ఆ లేఖలోని వివరాలు శనివారం మీడియాలో వచ్చాయి. ఆ లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
- ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆవిర్భావంపై వాటి మాతృరాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలు ఏక్రగీవ తీర్మానాలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పించాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానాలు అందిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించింది. సంబంధిత రాష్ట్రాల్లో మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించడం, సంబంధిత పక్షాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడమనే సంప్రదాయాన్ని ఇది ప్రతిబింబించింది.సరిగ్గా ఈ సంప్రదాయాన్ని, పద్ధతులను దృష్టిలో పెట్టుకునే అప్పటి కేంద్ర హోంమంత్రి శ్రీ చిదంబరం కేంద్ర ప్రభుత్వం తరఫున 2009 డిసెంబర్ 8వ తేదీన ఒక ప్రకటన చేశారు.

- రాష్ట్ర విభజన ప్రకటనపై ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం కావడం మీకు తెలిసిన విషయమే. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి తలొగ్గి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 23న మరో ప్రకటన చేశారు. 'ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో, బృందాలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఈ ప్రక్రియలో భారత ప్రభుత్వం సంబంధితులందరినీ భాగస్వాములను చేస్తుంది'' అని ప్రకటించారు.
- జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురించి ఆర్థిక మంత్రి చిదంబరం 2013 ఆగస్టు 12న రాజ్యసభలో ప్రస్తావిస్తూ మరో ప్రకటన చేశారు. "ఈ ప్రక్రియపై ముందుకు సాగడంపై నిర్ణయం తీసుకునేముందు... హైదరాబాద్ స్టేటస్తో సహా, అన్ని అంశాలపై అభిప్రాయాలు తెలుసుకుంటాం. రాజ్యాంగ విధానాలు, గతంలో అనుసరించిన విధానాల ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళుతుంది'' అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని మెజారిటీ ప్రజలు లేవనెత్తిన అంశాలు, స్టేక్ హోల్డర్లు లేవనెత్తుతున్న క్లిష్టమైన సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే ప్రశ్న ఇప్పుడు అత్యంత ప్రధానంగా మారింది. అ
- సాగునీటి జలాల పంపిణీ, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎక్కడా, ఎన్నడూలేని తలెత్తని సమస్య ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తలెత్తనుంది. ఎలాగంటే... రాష్ట్ర విభజన సాగునీటి ప్రాజెక్టులు, నదీ ప్రవాహాలను కూడా నిలువునా విభజిస్తుంది. ఒక డ్యామ్ లేదా నదిని రెండు సగాలుగా విభజించాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి ఏ రాష్ట్రంకానీ, ఏ దేశంకానీ ఇప్పటిదాకా ఎదుర్కోలేదు.
- రాజధాని నగరమైన హైదరాబాద్లో అభివృద్ధిపరిచిన ఉపాధి, విద్య, ఆరోగ్య సదుపాయాలు (విభజన తర్వాత) అందుబాటులో ఉండటం, తెలుగు ప్రజలందరికీ 'అవకాశాల గని'గా ఉన్న హైదరాబాద్ ప్రతిపత్తి అనేది మరో ప్రధానమైన, పరిష్కారం చూపించాల్సిన సమస్య. రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి ఇవ్వడమనే ఉదంతంకూడా గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వివిధ భాగస్వామ్య పక్షాల (స్టేక్ హోల్డర్స్) వాదనలు వినలేదు. వివిధ అంశాలకు పరిష్కారాలు కనుగొనడంపై చర్యలూ తీసుకో లేదు.
- ఎలాంటి హోంవర్క్ చేయకుండానే భారత ప్రభుత్వం విభజన ప్రక్రియను ప్రారంభించడం మెజారిటీ ప్రజల మనసుల్లో భయం, ఆందోళనలను సృష్టిస్తోంది. ఈ ఆందోళనలను రెండు ఉదంతాలు బలపరుస్తున్నాయి. మొదటిది... జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎప్పుడూ చర్చ జరగలేదు. పార్లమెంటులోనూ దీనిపై చర్చించలేదు. కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదు. రెండోది... వివిధ భాగస్వామ్య పక్షాలను సంప్రదించేందుకు నియమించిన ఆంటోనీ కమిటీ తన పని పూర్తి చేయనేలేదు. కమిటీ ఇచ్చే నివేదిక కోసం వేచి చూడాలని గానీ, ఇంత కీలకమైన అంశంపై పార్లమెంటులో చర్చించాలనిగానీ భారత ప్రభుత్వం ఎందుకు అనుకోవడంలేదనేది మాకు అర్థంకాని విషయంగా మారింది.
- వెనుకబడిన ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో సమాన అవకాశాలు కల్పించేందుకు తీసుకొచ్చిన రాజ్యాంగంలోని 371(డి) అధికరణ భవిష్యత్తు ఏమవుతుంది? ఈ విషయంలో తగిన హోంవర్క్ చేయని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
- మెజారిటీ ప్రజల అభిప్రాయాలను భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పాటుపై కేబినెట్ నోట్ను 'టేబుల్ ఐటం'గా తీసుకురావడం అగ్నికి ఆజ్యం పోసింది.
- కేబినెట్ నోట్లో కీలకమైన మంత్రిత్వ శాఖలైన జల వనరులు, పట్టణాభివృద్ధి, విద్యుత్తు, మానవ వనరుల అభివృద్ధితోపాటు ప్రణాళికా సంఘం ఉన్నాయి. ఆ తర్వాత కేబినెట్ సచివాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఇవి లేకపోవడం మాకు దిగ్భ్రాంతి కలిగించింది.












Click it and Unblock the Notifications