స్థానిక పోరు: జగన్ పార్టీ విజేతలకు టిడిపి ఎర?
హైదరాబాద్: స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలకు జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెస్ పార్టీకి విప్ జారీచేసిన అధికారం లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాల పక్షమైన తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. సార్వత్రిక ఎన్నికల కంటే సుమారు నెల రోజులు ముందు గానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పటికీ,వాటి ఓట్ల లెక్కింపు సార్వత్రిక పోలింగ్ తర్వాతే జరిగింది.
అయితే అధ్యక్ష స్థానాలకు పరోక్ష ఎన్నికలకు ముహూర్తం ఇప్పటిదాకా కుదరలేదు. తాజాగా జూలై మొదటి వారంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మళ్ళీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో 14 పార్టీలకు మాత్రమే విప్ జారీచేసే అధికారం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అధికారి రమాకాంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇటీవలే వచ్చిన ప్పటికీ ప్రస్తుతానికి అది ఈ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభించే పరిస్థితి కనిపించడం లేదు. రమాకాంత్రెడ్డి విడుదల చేసిన జాబితాలో వైయస్సార్ కాంగ్రెసు పేరు లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారికి ఎరవేయడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జడ్పీలను దక్కించు కోవడంలో కడప జిల్లాలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. మరో రెండు మూడు జిల్లాల్లో డోలాయమాన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందిగ్ద పరిస్థితులు చాలా మునిసిపాలిటీల్లో కూడా ఉన్నాయి. ఇలాంటి చోట్ల వైకాపాకు చెందిన వారికి రకరకాల తాయిలాలతో తమవైపు ఆకర్షించుకుంటే అధ్యక్ష స్థానాల్ని కైవసం చేసుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి విప్ జారీ చేసే అధికారం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చెప్పారు. ఈ స్థితిలో తమ పార్టీ సభ్యులను కలిసికట్టుగా ఉంచుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పారట్ీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా జిల్లాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో గోవాలో క్యాంప్ పెట్టారు.