ఆ రాష్ట్రాలే ‘కీ’: రాజస్థాన్, ఎంపీల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత.. బై పోల్స్ ఫలితాలే నిదర్శనం
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లోని విజయాలతో దేశం నలుమూలల విస్తరించిన పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఇప్పటివరకూ అంతగా బలంలేని కేరళ, పశ్చిమబెంగాల్లోనూ కాషాయ జెండాను ఎగురవేయటం తథ్యమంటున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 350 లోక్సభా స్థానాలను సొంతంగా గెలుచుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఆ పార్టీ అధినేతల లక్ష్యం సాకారం కావాలంటే ముందుగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నాలుగు పెద్ద రాష్ట్రాలు.. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాల్లో ఎదురయ్యే పరీక్షను అధిగమించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మధ్యప్రదేశ్లో 29 స్థానాలకు 27 చోట్ల కమలనాథులే
ఈ నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం 103 లోక్సభ స్థానాలకు 2014లో బీజేపీ 70 స్థానాలను గెలుచుకున్నది. రాజస్థాన్లోని 25 లోక్సభ స్థానాలను, మధ్యప్రదేశ్లో 29కి 27 స్థానాలను కమలనాథులు సొంతం చేసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఆ ఎన్నికల్లో 28లోక్సభ స్థానాలకు బీజేపీ అత్యధికంగా 17 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో హస్తం పార్టీ కమలనాథుల దరిదాపుల్లోకి కూడా రాలేదు.

ఒడిశా ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి భిన్నమైన సంకేతాలు
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనీ కాసింత నిరాశ పరిచాయి. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ బలం పుంజుకోవటం, ఒడిశాలో అధికార బీజేడీ విజయం సాధించటం కమలనాథులకు భిన్న సంకేతాలను పంపిస్తోంది.

రాజస్థాన్లో నాలుగున్నరేళ్లలోనే కమలనాథులపై వ్యతిరేకత
మధ్యప్రదేశ్లో మూడు దఫాలుగా, రాజస్థాన్లో నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్న అభిప్రాయాలకు బలం చేకూర్చుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో మాదిరిగా ఒడిశాలోనూ 2014లో మాదిరిగా నరేంద్ర మోదీ ప్రభంజనం మళ్లీ సత్తా చాటుతుందా? లేదా? అన్న సందేహం కలగజేస్తోంది.

బీజేపూర్లో ఇలా వెనుకబడ్డ కమలనాథులు
ఒడిశాలో గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించిన బీజేపీ ఇటీవలి బిజేపుర్ శాసనసభా స్థాన ఉప ఎన్నికలో వెనుకబడిపోయింది. అధికార బీజేపీ అభ్యర్థి రీటా సాహు 40వేల ఓట్లకు పైగా గెలవటంతో ఒడిశాలో కమలనాథుల విజయం అంత సులభం కాదేమోనన్న అభిప్రాయం అవుతోంది. ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది.

మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గ్రూపులను కలిపిన ఉప ఎన్నికలు
త్రిపురలో 20 ఏళ్లపాటు సీఎంగా ఉన్న సీపీఎం నేత మాణిక్యసర్కార్ పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారు. బీజేపీని తిరుగులేని ఆధిక్యంతో గెలిపించారు. మధ్యప్రదేశ్లో దాదాపు 15ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నేత శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన కోలారస్, మూంగావలీ అసెంబ్లీ స్థానాల ఫలితాలు దానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కు చెందినవైనా మళ్లీ వాటిని నిలుపుకోగలగటం విశేషం. కాంగ్రెస్లోని వివిధ గ్రూపుల నేత(కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా)లను ఈ ఉప ఎన్నికలు ఏకతాటిపైకి తీసుకొచ్చాయని అంటున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలా ప్రజా వ్యతిరేకత
రాజస్థాన్లో ఉప ఎన్నికలు జరిగిన అజ్మేర్, అల్వార్ లోక్సభ స్థానాల పరిధిలో ముఖ్యమంత్రి వసుంధరా రాజె ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు బీజేపీ గెలుచుకున్నవే. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ పిలుపునిస్తున్న బీజేపీ...తాను అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుందా అనే సందేహాలకు ఈ ఫలితాలు తావిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే ఉండటం ముఖ్యమైన విషయం. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో జరుగనున్నాయి. అప్పటికి 2019 లోక్సభ ఎన్నికలకు నాలుగైదు నెలల మాత్రమే గడువు ఉంది మరి.

అకాలీదళ్తో కలిసి పంజాబ్లో బీజేపీ ఓటమి
గత ఏడాది కాంగ్రెస్ నుంచి మణిపుర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్తో కలసి అధికారంలో ఉన్న పంజాబ్ను మాత్రం కోల్పోయింది. ఇటీవల ఎన్నికలు జరిగిన గుజరాత్లో బీజేపీ విజయం సాధించినా కాంగ్రెస్ పార్టీ మెరుగైన పనితీరును కనబరిచింది.రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో విజయమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది.

ఈశాన్య ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో నిరాశ ఇలా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో దక్షిణాది విజయాలకు అంకురార్పణ చేయాలని భావిస్తున్న కమలనాథులకు ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. బీజేపీ వరుస విజయాలకు త్రిపురలోనైనా గండిపడుతుందని ఆశించిన కర్ణాటక కాంగ్రెస్ను తాజా ఫలితాలు తీవ్ర నిరాశపరిచాయి. బీజేపీ సంచలన విజయాలు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ నేతలను కలవరపరుస్తున్నాయి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications