బాబు దెబ్బకు రెండు పిట్టలు: బాలకృష్ణతో హరికృష్ణకు చెక్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'నందమూరి' కుటుంబానికి చెక్ చెబుతున్నారా? అంటే అవుననే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ కేబినెట్లోకి తనయుడు నారా లోకేష్ను తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.
హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నందమూరి బాలకృష్ణకు కాకుండా లోకేష్కు మంత్రి పదవి ఇస్తారనే వాదనలు వినిపించడం వెనుక... బాలకృష్ణను పక్కన పెట్టేందుకేననే రూమర్స్ వినిపిస్తున్నాయి. టిడిపి నేతల కూడా పదేపదే లోకేష్ పేరును మంత్రి పదవి కోసం పలవరిస్తుండటం గమనార్హం.
నారా లోకేష్ పేరును తెరపైకి తీసుకు రావడం వెనుక బాలకృష్ణకు మొండి చెయ్యి ఇచ్చేందుకేనని కొందరు విమర్శలు చేస్తున్నారు. లోకేష్కు మంత్రి పదవి ఇచ్చినా, మరో ఉన్నత పదవి ఇచ్చినా.. బాలకృష్ణ కాదని చెప్పలేరు. ఎందుకంటే లోకేష్ స్వయానా అల్లుడు కావడం గమనార్హం.
మరోవైపు, చంద్రబాబు పైన, టిడిపిలో వారసత్వం పైన ఎప్పుడూ అసంతృప్తితో వెళ్లగక్కే నందమూరి హరికృష్ణ మరోసారి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి ఆయనకు సరైన హామీ రాలేదని తెలుస్తోంది.
అదే సమయంలో నందమూరి బాలకృష్ణను రాజ్యసభకు పంపించడం ద్వారా హరికృష్ణకు చెక్ పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటే మరో అధికార కేంద్రం అవుతారని భావించడం వల్లే పక్కన పెడుతుండవచ్చునని అంటున్నారు.
హిందూపురం నుంచి గెలిచిన బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వకుండా.. ఆయనను రాజ్యసభకు పంపించడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
బాలయ్యను రాజ్యసభకు పంపిస్తే.. హరికృష్ణకు అడిగేందుకు అవకాశం ఉండదు. అదే సమయంలో తన కేబినెట్లో బాలయ్య లేకుండా చూసుకోవడం కూడా కుదురుతుందని అంటున్నారు. అయితే, ఇదంతా, వట్టిదేనని, బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగానే గెలిచారని, ఇకముందు కూడా ఉంటారని మరికొందరు చెబుతున్నారు.