దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా ఉడుతా భక్తిగా సహకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఢిల్లీలో మకాం వేసి తనకు సాధ్యమైనంత వరకు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి చేయూత ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతోనూ భేటీ అయ్యారు. అయితే తాను జగన్ కోసం వారిని కలవలేదని, వేరే పనుల మీద కలిశానని ఆమె అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి వ్యవహారమంతా ప్రణబ్ ముఖర్జీ చుట్టూ తిరుగుతోంది. దీంతో గురువారం కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా గురువారం ప్రణబ్ ముఖర్జీని కలిసి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అందుకు ప్రణబ్ సానుకూలంగా ప్రతిస్పిందించినట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే లాబీ అన్ని విధాలుగా పార్టీ అధిష్ఠానవర్గాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అపారమైన తెలివితేటలు, చాకచక్యం, ధారాళమైన వాగ్ధాటి గల రేణుకా చౌదరి కూడా జగన్ కు అనుకూలంగా సోనియా, ప్రణబ్ ముఖర్జీల చెవుల్లో వేశారనే అంటున్నారు. ఏమైనా అంతా జగన్మాయగా తోస్తోంది.