ఎస్వీ చానల్ లో రాజకీయాలు!
తాజాగా టిటిడి చైర్మన్ ఆదికేశవుల నాయుడిని మద్యం వ్యాపారి అని విమర్శిస్తూ ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలను ఎస్వీ భక్తి ఛానల్లో నేరుగా ప్రసారం చేశారు. ఆ వ్యాఖ్యల దుమారం ఎస్వీ భక్తి ఛానల్ను కుదిపేసింది.ఆ విమర్శలను ఎలాంటి ఎడిట్ లేకుండా నేరుగా ప్రసారం చేసినందుకు ఆ ఛానెల్ సీఈఓ శర్మపై వేటు పడినట్టు సమాచారం. దీర్ఘకాలిక సెలవు మీద వెళ్లిపోయిన శర్మ తిరిగి ఇక ఛానెల్లో అడుగు పెట్టబోరని తెలుస్తోంది. అంతేగాక బాబాపై ఆదికేశవులు నాయుడు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రసారం చేశారు. శర్మ వైఖరిపై ఆగ్రహించిన ఆదికేశవులు నాయుడు ఆయనకు చీవాట్లు పెట్టినట్టు చెప్తున్నారు. మూడు నెలల జీతం చెల్లించి తక్షణమే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని శర్మకు ఆదికేశవుల నాయుడు అల్టిమేటం ఇచ్చారని సమాచారం.
ఇక శర్మ దూరదర్శన్ లో దీర్ఘకాలంగా పని చేసి రావటంతో అక్కడ పద్దతులే తుచ తప్పకుండా ఇక్కడా అనుసరిస్తూంటాడని,ఆయన శిష్యులను చాలమందిని ఛానెల్ లో ఉద్యోగస్తులను చేసి మెప్పు పొందాడని కథలు కథలుగా చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఆయన అండ చూసుకుని సినిమాల్లో ఫెయిల్యూర్ అయిన దర్శక,నిర్మాతలంతా తమ తమ చెత్త పోగ్రామ్ లతో అక్కడ క్యూ కట్టారు.
అదృష్టవశాత్తు ఆ ఛానెల్ చూసే వారి సంఖ్య అతి తక్కువుగా ఉండటం,పెట్టుబడి పెట్టేది దేవస్ధానం కావటంతో ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా పోతోంది. అక్కడ పరిస్ధితి ఎంతగా దిగజారిందన్న దానికి ఉదాహరణగా స్క్రిప్టు ఓకే చేయాలంటే ఆ స్క్రిప్టు మొత్తం అక్కడ వారే టైప్ చేస్తారని డబ్బు తీసుకునే దాకా వెళ్ళింది. బయిట టైప్ చేయించుకు వెళ్తే అక్కడ ఓకే కాదని, ఆ టైప్ చేసే వ్యక్తులు ఇంటివద్ద కొన్ని కంప్యూటర్లు తీసుకుని,కొంత మందిని నియమించుకుని మరీ జాబ్ వర్క్ చేయిస్తారని చెప్తూంటారు.
తాజా పరిణామాల నేపథ్యంలో శర్మ రిలయన్స్ ఆధ్వర్యంలోని బిగ్ ఎఫ్ఎం రేడియోలో సీఈవోగా చేరేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు చానల్లో నియమితులైన ఉద్యోగుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను శర్మ తీసుకున్నారు. వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సర్టిఫికెట్లను తమకు ఇప్పించాలని వారు కోరుతున్నారు.ఏడుకొండలవాడు ఇవన్నీ చూస్తూ ఎట్లా భరిస్తున్నాడో...