దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కుమారుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వైయస్ జగన్ ను సమర్థిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ వర్గం మాత్రం ఆయనపై ఆశలు పెట్టుకున్నట్లు లేదు. జగన్ కు మద్దతిచ్చే శాసనసభ్యుల సంతకాలను ఒక వర్గం సేకరించింది. ఈ సంతకాల సేకరణ సమయంలో జగన్ వర్గీయులు విష్ణును సంప్రదించలేదు. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా చెప్పారు. తననెవరూ సంతకం చేయాలని అడగలేదని ఆయన చెప్పారు. అయితే విష్ణు జగన్ కు మద్దతిచ్చే అవకాశం లేదని అంటున్నారు. పి. జనార్దన్ రెడ్డికి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి నిరంతరం విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. కారు ఢీకొన్న సంఘటనలో విష్ణుపై వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు కేసు కూడా పెట్టారు. ఆ సమయంలో తీవ్ర వివాదం చేలరేగింది. ఇటీవలి ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో తమకు వైయస్ అన్యాయం చేశారనే అభిప్రాయం పి. జనార్దన్ రెడ్డి వర్గంలో ఉంది. పిజెఆర్ కూతురు, విష్ణు సోదరి తిరిగుబాటు అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. విష్ణుకు కూడా తాను కోరుకున్న ఖైరతాబాద్ సీటు ఇవ్వలేదనే అభిప్రాయం ఉందని చెబుతారు. ఈ స్థితిలో విష్ణు జగన్ ను సమర్థించబోరని అంటున్నారు. రోశయ్య సమర్థుడైన నాయకుడని విష్ణు మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే నాయకత్వ మార్పు విషయంలో తాను పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెబుతున్నారు. ఏమైనా యువనేత విష్ణుకు మరో యువ నేత జగన్ ముఖ్యమంత్రి కాకూడదనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.