ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కొత్త సమస్య వచ్చి పడింది. అది ఒక రకంగా సంతోషకరమైన సమస్య. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీ చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అందులో భాగంగానే చిరంజీవి ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెసు పార్టీ అధిష్టానం వైయస్ జగన్ పై చర్య తీసుకుంటూ చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకుంటారని అంటున్నారు. ఈ స్థితిలో పార్టీ శాసనసభ్యులు చిరంజీవిని కలిసి తమకు మంత్రి పదవులు కావాలంటూ అడుగుతున్నారు. దీంతో చిరంజీవి చెంత చాలా కాలం తర్వాత హల్ చల్ మొదలైంది. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య, శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి చిరంజీవిని కలిశారు. అలాగే యలమంచిలి శివాజీ వంటి వారు కూడా ఆయనను కలిశారు. మంత్రి పదవుల కోసం చిరంజీవి వద్ద ఈ రకంగా గిరాకీ పెరిగింది. అయితే, శాసనసభ్యులందరికీ మంత్రి పదవులు ఇప్పించడం చిరంజీవి వల్ల కాదనేది సత్యం. 16 మంది ప్రజారాజ్యం శాసనసభ్యులకు రోశయ్య కూడా మంత్రి పదవులు ఇవ్వలేరు. అందువల్ల శాసనసభ్యులకు నచ్చజెప్పడం చిరంజీవికి కొంత కష్టంగానే ఉంటుంది. మంత్రి పదవులు దక్కనివారు పార్టీకి దూరమవుతారా అనేది కూడా ఓ సమస్యనే.