తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి నోరు పారేసుకున్నారు. తెలంగాణకు రెడ్లే ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన రెండ్లు తెలంగాణకు చెందిన బ్రాహ్మణ, రెడ్డి నాయకుల్లో అవిశ్వాసాన్ని పెంచారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర విలీనానికి వారు అంగీకరించారని ఓ చారిత్రక విశ్లేషణ చేశారు. ఇప్పుడు కూడా ఆ వర్గానికి చెందినవారే సమైక్యాంధ్ర నినాదానికి పురుడు పోశారని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర, రాయలసీమ రెడ్లు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల విలీనానికి 1950ల్లో కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులోని రెడ్డి హాస్టల్లో మకాం వేసిన మాజీ రాష్టపతి నీలం సంజీవరెడ్డి తెలంగాణ రెడ్లను, బ్రాహ్మణులను విడగొట్టి తెలంగాణకు ద్రోహం తలపెట్టారని ఆయన ఆరోపించారు. ఆ రకంగా నీలం సంజీవరెడ్డితో పాటు రాయలసీమ, ఆంధ్రకు చెందిన రెడ్లు బ్రాహ్మణ, రెడ్ల మధ్య విభేదాలను సృష్టించారని, దాంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ సాకారం చేసుకున్నారని ఆయన విమర్శించారు.