ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవిపై తెలుగు మీడియా శీతకన్ను వేసినట్లే ఉంది. ఆయన రాజకీయ వార్తలకు మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన చేసిన పర్యటన వార్తలకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన 150 చిత్రంపై టీవీ చానెళ్లు గాసిప్స్ పెద్ద యెత్తునే ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ వార్తలకు మాత్రం పూర్తిగా ప్రాధాన్యం తగ్గించాయి. ఆయన గురువారం సాయంత్రం వరద బాధితులకు సహాయం అందించే విషయంపై ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని మీడియా చానెళ్లు గానీ పత్రికలు గానీ పెద్దగా పట్టించుకోలేదు. తనపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యపై చిరంజీవి ఘాటుగా ప్రతిస్పందించారు. రాష్ట్రానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఏం సాధించి పెట్టారో చెప్పాలని ఆయన పొన్నం ప్రభాకర్ ను సవాల్ చేశారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు బద్దకస్థులని ఆయన వ్యాఖ్యానించారు. అయినా ఆ వార్తలకు చాలా పత్రికల్లో, టీవీ చానెళ్లలో చోటు లభించలేదు. దీన్ని బట్టి చిరంజీవి ఇమేజ్ తగ్గిందా అనే అనుమానం కలుగుతోంది. అయితే, ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలు ఉండడం వల్ల, కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకీ మరికొన్ని పత్రికలు కాంగ్రెసుకూ అనుకూలం కావడం వల్ల చిరంజీవికి మీడియాలో చోటు కరువైందనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై చిరంజీవి కూడా సీరియస్ గానే ఆలోచిస్తున్నారట.