కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు పెద్ద రిలీఫ్ నే ఇచ్చినట్లుంది. ప్రత్యర్థుల ఆరోపణల నుంచి ఆయనకు కాస్తా ఊరట లభించింది. వైయస్ జగన్ వ్యవహారం ముందుకు రావడంతో కాంగ్రెసుకు చెందిన సీమాంధ్ర నాయకులంతా బిజీ అయిపోయారు. కెసిఆర్ ను పట్టించుకునే సమయం వారికి లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైయస్ జగన్ వ్యవహారం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే పరిణామాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో తెలుగుదేశం నుంచి కూడా కెసిఆర్ కు విమర్శ దాడి తప్పింది. కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారంటూ కెసిఆర్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు జడివాన కురిపిస్తూ వచ్చారు. జగన్ వ్యవహారంతో మధ్యంతర ఎన్నికలు వస్తే తనకు కలిసి వస్తుందని కూడా కెసిఆర్ అనుకుంటున్నారు. ఈ స్థితిలో ఆయన కూలీపనులు చేయడానికి సమాయత్తమయ్యారు. వచ్చే నెల 9వ తేదీన వరంగల్ లో తలపెట్టిన బహిరంగ సభకు కూలీ పనులు చేసి తెరాస నాయకులు డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా కెసిఆర్ కూలీ పనులు చేస్తారు.