మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శిబిరంలో హార్డ్ కోర్ నాయకురాలు కొండా సురేఖపై వేటు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. శానససభ్యురాలు కొండా సురేఖ తొలి నుంచి అధిష్టానంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి బహిరంగ లేఖలు కూడా రాశారు. సోనియా గాంధీ తీరును ఆ లేఖల్లో తప్పు పట్టారు. కాంగ్రెసు నాయకులపై వాగ్బాణాలు సంధించారు. ఈ స్థితిలో కొండా సురేఖపై అనర్హత వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ మేరకు చర్యలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెసు అధిష్టానం ఆ మేరకు ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. సురేఖపై చర్యలు తీసుకుంటే జగన్తో వెళ్లేందుకు శాసనసభ్యులు భయపడుతారని అనుకుంటున్నారు. ఆ చర్యల వల్ల పరిణామాలు ఎటు దారి తీస్తాయో అంచనాకు రావచ్చుననేది కూడా ఓ ఆలోచనగా చెబుతున్నారు. సురేఖతో పాటు తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కూడా అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు చాలా కాలంగా కోరుతున్నారు. జగన్ వెంట వెళ్తున్న శానససభ్యులపై అసమ్మతి వేటు ద్వారా ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు సమాచారం.