వైయస్ జగన్ వ్యూహం పారుతోందా?
ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులకు చుట్టుకుంది. దానికి తోడు, ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా చుట్టుకుంది. ఆస్తుల కేసుపై సిబిఐ దర్యాప్తు వల్ల వైయస్ జగన్ జైలుకు వెళ్లినా తనతో పాటు మరింత మందిని ఆయన తీసుకుని పోతున్నట్లే ఉన్నారు. ధర్మాన ప్రసాద రావు వ్యవహారంతో కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు.
జగన్పై ఎదురుదాడి అటుంచి, కిరణ్ కుమార్ రెడ్డి తనను తాను రక్షించుకోవడానికి, తన మంత్రులు కాపాడడానికే ముప్పు తిప్పలు పడాల్సిన పరిస్థితి. జగన్కు దీటుగా జవాబు చెప్పడానికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా వలలో చిక్కుకున్నట్లే. ధర్మానతో పాటు మరో నలుగురు మంత్రులు వరుస కడుతారనే మాట గట్టిగానే వినిపిస్తోంది. ఆ నలుగురు మంత్రుల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయి.
సాధారణ ఎన్నికలకు పెద్ద సయమం కూడా లేదు. కేవలం 18 నెలలు మాత్రమే ఉంది. పార్టీని గాడిలో పెట్టాలనే కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నాలు ఫలించడం లేదు. పైగా, కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు వైయస్ జగన్ వైపు నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో నలుగురు మంత్రులకు కూడా ధర్మాన ప్రసాద రావు పరిస్థితే ఎదురైతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెసు పార్టీ గానీ కోలుకోవడం కష్టమే.
ఈ రకంగా తన వ్యూహంలో వైయస్ జగన్ పైచేయి సాధించినట్లే. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన అవసరం ఏర్పడే పరిస్థితిని కల్పించడమే జగన్ ఉద్దేశం. అందుకే ప్రత్యర్థుల ఎత్తులకు పైయెత్తులు వేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.
ముఖ్యమంత్రిని కుదురుకోకుండా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కాంగ్రెసు పార్టీని ఆత్మరక్షణలో పడేసి వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీ తప్ప మరోటి దిక్కులేదని అనిపించడానికి జగన్ సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.