చిరంజీవి ఇన్ అగాథా ఔట్: 'జగన్'తో విహెచ్కూ
దీంతో బెర్తులు కన్ఫర్మ్ చేసుకునేందుకు పలువురు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. మన రాష్ట్రానికి మూడు నుండి ఐదు పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. విస్తరణ ఆదివారమైనా రెండు రోజులు ఆలస్యమైనా చిరంజీవి పేరు మాత్రం ఖరారైంది. కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావు, సర్వేపల్లి సత్యనారాయణ, వి హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం.
చిరంజీవితో పాటు విహెచ్ పేరు కూడా ఖరారైందని ఢిల్లీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అధిష్టానానికి దగ్గర కావడం, పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పటం తదితర పలు అంశాలు విహెచ్కు కలిసి వచ్చి ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. చిరుతో పాటు విహెచ్ పేరు కూడా ఖారారైందని, మిగిలిన నలుగురి పేర్లు మాత్రమే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఖాళీగా ఉన్న వాటిని ఫుల్ ఫిల్ చేయడంతో పాటు ముగ్గురు, నలుగురు నేతలకు ఉద్వాసన కూడా పలికే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేసిన పిఏ సంగ్మా తనయ అగాథా సంగ్మా పేరు వినిపిస్తోంది. ఆమెను కేంద్రమంత్రివర్గం నుండి తొలగించనున్నారని అంటున్నారు. దీపా దస్మున్షి, ఓ మహారాష్ట్ర ఎంపిని తీసుకోనున్నారని తెలుస్తోంది.
గుజరాత్, హర్యానా రాష్ట్ర నేతలకు కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా డిఎంకె యూపిఏలో చేరేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో అవి కూడా కాంగ్రెసు నేతలతో ఫిల్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ విషయమే ఇప్పటికి ఎటూ తేలలేదని తెలుస్తోంది. అయితే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.