లేఖతో బోర్లాపడ్డ బాబు: మాటతప్పిన కెసిఆర్

తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని... దీనిని తేల్చేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను కేంద్రానికి లేఖ రాశానని, అందులో తమ అభిప్రాయం స్పష్టంగా చెబుతామని కానీ, కేంద్రం మాత్రం అఖిల పక్ష సమావేశానికి ముందుకు రావడం లేదని ఆయన కేంద్రపై తెలంగాణ భారం మోపారు. అయితే ఎఫ్డిఐల కారణంగా తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిల పక్షానికి ఓకే చెప్పారు.
తాము డిమాండ్ చేయడం వల్లే కేంద్రం అఖిల పక్షానికి సిద్ధపడిందని తెలుగుదేశం పార్టీ చెప్పింది. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు మాత్రం అది తమ ఘనతే అన్నారు. అఖిల పక్షానికి తెలంగాణ ఎంపీలు కారణమైనా, చంద్రబాబు లేఖ కారణమైనా టిడిపి మాత్రం ఇప్పుడు చిక్కుల్లో పడిందని అంటున్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు మొదటి నుండి చెపుతున్నారని కానీ, అఖిల పక్షంలో అలా చెబితే ఊరుకునేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణకు అనుకూలమా లేక వ్యతిరేకమా స్పష్టంగా తెలియజేయాలని వివిధ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే టిడిపి మాత్రం తాము వ్యతిరేకం కాదని, గతంలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని, ముందు అధికార కాంగ్రెసు పార్టీ తమ అభిప్రాయాన్ని అఖిల పక్షంలో డిమాండ్ చేసే అవకాశముంది. టిడిపి అఖిలపక్షంలో అనుకూలమని చెప్పలేదు... పూర్తిగా వ్యతిరేకమని చెప్పలేదు... కానీ తెలంగాణకు వ్యతిరేకం కాదని మాత్రమే చెప్పగలదు.
అలా చెబితే తెలంగాణవాదులు, మిగతా పార్టీలు కూడా టిడిపిని మరోసారి ప్రధానంగా టార్గెట్ చేయనున్నాయి. అఖిల పక్ష సమావేశం పెట్టమని చెప్పి చంద్రబాబు ఇప్పుడు మరోసారి 'తెలంగాణ' చిక్కుల్లో పడిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అఖిల పక్షం పెడితే ఒక్కో పార్టీ నుండి ఇద్దర్ని పిలిస్తే తాము వెళ్లేది లేదని గతంలో చెప్పారు.
కానీ ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్ష సమావేశానికి కేంద్రం ఇద్దర్ని పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బిజెపి కూడా అదే పాట పాడింది. కానీ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసును వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకే ఆ పార్టీలు మొదట నో చెప్పినా ఇప్పుడు వెళ్లేందుకు సిద్దపడుతున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications