చిరంజీవికి ముఖ్యమంత్రి పీఠంపైనే గురి?

పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ తీరు పట్ల అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి పదవితో పాటు పిసిసి అధ్యక్ష పదవిని కూడా తన వద్ద ఉంచుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిపత్యం సాధించడానికి బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టినట్లు విశ్లేషిస్తున్నారు. ఏదో ఒక పదవి మాత్రమే ఉండాలనే కారణం చెప్పి బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తీసేయడానికి అధిష్టానం రంగం సిద్ధం చేసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఉంటే ఎంత, ఊడితే ఎంత అనే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చూస్తే పిసిసి పదవి చిరంజీవిని వరించేట్లుందని చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ సామాజిక వర్గానికే చెందిన చిరంజీవి పిసిసి అధ్యక్ష పదవికి ప్రస్తుత స్థితిలో సరిపోతారని అధిష్టానం భావిస్తోందట. ఇమేజ్తో పాటు కాంగ్రెసు క్యాడర్ చిరంజీవికి కలిసి వస్తుందని చెబుతున్నారు. 2014 ఎన్నికల బాధ్యతను భుజాల మీద మోపి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని ముందు పెట్టేందుకు ఓ నిర్ణయం జరిగిపోయిందని కూడా అంటున్నారు.
అయితే, పిసిసి అధ్యక్ష పదవితో పాటు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలా అవకాశం లేదని, పిసిసి అధ్యక్షుడిగా రావడానికే చిరంజీవి మొగ్గు చూపుతున్నారని, దానివల్ల తన ముఖ్యమంత్రి కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం సులభం అవుతుందని చిరంజీవి భావిస్తున్నారట. మంత్రి సి. రామచంద్రయ్య వంటివారి ప్రకటనలు చూస్తుంటే చిరంజీవి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి తగిన వ్యూహరచనతోనే ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications