రాములమ్మపై కెసిఆర్ వ్యూహాత్మక అడుగులు

K Chendrasekhara Rao - Vijayashanthi
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మధ్య దూరం పెరుగుతోందా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా కెసిఆర్, విజయశాంతి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య వారి మధ్య దూరం మరింత పెరుగుతోందని అంటున్నారు.

ఇందుకు సోమవారం తెరాస నిర్వహించిన ఆచార్య జయశంకర్ జయంతి సభలో విజయశాంతికి కెసిఆర్ మాట్లాడే అవకాశమివ్వక పోవడమే నిదర్శనమని అంటున్నారు. తెరాస భవనంలో ఆచార్య జయశంకర్ జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడారు. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు మాట్లాడారు. కానీ విజయశాంతికి మాత్రం మాట్లాడే అవకాశం రాలేదు.

తెరాసలో కెసిఆర్ తర్వాత స్థానం విజయశాంతిదే అని తొలి నుండి ఉన్న మాట. కానీ వారిద్దరి మధ్య పొడసూపిన విభేదాల కారణంగా ఇప్పుడు విజయశాంతిది కేవలం పేరుకే రెండో స్థానమని, కానీ పార్టీ కార్యక్రమాలలో, వేదికలపై ఆమెకు కెసిఆర్ తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు. ఓ విధంగా ఆమె ప్రాధాన్యతను క్రమంగా తగ్గించే ప్రయత్నాలు వ్యూహాత్మకంగా చేస్తున్నారని అంటున్నారు.

2009 సాధారణ ఎన్నికలలో మెదక్ టిక్కెట్‌ను కెసిఆర్ తప్పని పరిస్థితులలో విజయశాంతికి ఇచ్చారు. అప్పటి నుండి ఆమెపై గుర్రుగానే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత నుండి పలుమార్లు వారి మధ్య విభేదాలు ఉన్నట్లుగా వారి వ్యవహార శైలియే కనిపిస్తోంది. గత సంవత్సరం బిజెపి అగ్ర నేత అద్వానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆమె తెరాస నేతల అభిప్రాయాలను పక్కన పెట్టి మరీ ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అప్పుడే ఆమె బిజెపిలోకి వెళుతుందనే వ్యాఖ్యలు వినిపించాయి.

కానీ ఆ తర్వాత్తర్వాత ఆమె బిజెపినే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది. తనపై కెసిఆర్ గుర్రుగా ఉన్న కారణంగా ఆయనను చల్లబర్చేందుకే ఆమె బిజెపిని టార్గెట్ చేశారనే వ్యాఖ్యలు వినిపించాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కూడా విజయశాంతికి చేదు అనుభవమే ఎదురయింది. తాజాగా మరొకటి. ఇలా పలువురు నేతలకు ప్రాధాన్యం ఇస్తున్న కెసిఆర్ విజయశాంతి పట్ల నిర్లక్ష్యం చూపిస్తుండటం వెనుక ఆమెతో రోజు రోజుకు పెరుగుతున్న దూరమే కారణమని అంటున్నారు.

ఆమె ఎప్పటికైనా బిజెపి వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయన్న వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో ఆమె ప్రాధాన్యతను సాధ్యమైనంతగా తగ్గించడమే కెసిఆర్ ముందున్న లక్ష్యమని అంటున్నారు. అయితే టిఆర్ఎస్ అన్నా తెలంగాణ అన్న కెసిఆర్ అని అలాంటప్పుడు విజయశాంతి ప్రాధాన్యత తగ్గించాల్సిన అవసరం తెరాస అధినేతకు ఎందుకుంటుందని మరికొందరు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+