ఫ్యాన్స్ని నిరాశపర్చిన చిరు: బ్రాండ్ అంబాసిడర్గా..
అయితే చిరంజీవి ఇక తాను నటనకు గుడ్ బై చెప్పినట్లు చెప్పకనే చెప్పినట్లుగా పై వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా 150 సినిమాను చేస్తానని చెప్పారు. ఇటీవలి వరకు ఆయన అదే మాట చెప్పారు. కేంద్రమంత్రులు పలువురు కూడా తనను నటన మానుకోవద్దని సలహా ఇచ్చారని చిరు పలుమార్లు చెప్పారు. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు.
తప్పకుండా చేస్తానని చెప్పినప్పటికీ రాజకీయాల్లో బిజీ ఉండటంతో నాలుగేళ్లుగా ఆయనకు సినిమా చేసేందుకు వీలుకాలేదు. నటిస్తానని నాలుగేళ్ల నుండి చెప్పినా ఆయనకు సమయం దొరకలేదు. ఆయన శనివారం కూడా ఇక ముందు తనకు సమయం దొరకదనే చెప్పారు. అయితే ఒక్కసారిగా నటించనని చెప్పి ఫ్యాన్స్ను బాధపెట్టడం కంటే అవకాశం చిక్కితే చేస్తానని చెప్పి కొంత ఊరట కల్గించేందుకే చెప్పినట్లుగా కనిపిస్తోంది.
ఒకవేళ సమయం దొరికితే.. అన్నప్పటికీ నాలుగేళ్లుగా దొరకని టైం ప్రస్తుతం కేంద్రమంత్రిగా, ముందు ముందు కీలక పదవులు అధిరోహించే వేళలో ఇంకా సమయం చిక్కడం కష్టమే అని చెప్పవచ్చు. అయితే తనకు నటించే సమయం చిక్కదని చెప్పడం ద్వారా చిరంజీవి తన అభిమానులను మాత్రం పూర్తిగా నిరాశపర్చారనే చెప్పవచ్చు. పర్యాటక శాఖ మంత్రి అయిన చిరంజీవి ఇక నుండి తన కాన్సంట్రేషన్ మొత్తం తన శాఖ పైనే పెట్టనున్నారు.
తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన చిరంజీవి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. బాలీవుడ్లోనూ ఆయన నటించారు. దక్షిణ భారత దేశంలో అందరికీ సుపరిచితుడు. దేశ విదేశాల్లో ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దీంతో చిరంజీవి తన శాఖకు తానే బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఇతరులను తీసుకున్నప్పటికీ వారితో ధీటుగా చిరంజీవి కూడా తన శాఖకు ఖచ్చితంగా ఓ బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా చిరంజీవికి కితాబు ఇచ్చారట. ఈ విషయాన్ని చిరంజీవే బాధ్యతలు స్వీకరించే సమయంలో మీడియాకు చెప్పారు. నీ శాఖకు నీవే బ్రాండ్ అంబాసిడర్ అని ప్రధాని అన్నారని చెప్పారు. అయితే పర్యాటక శాఖను అభివృద్ధి చేసేందుకు చిరంజీవి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ను బ్రాండ్ అబాసిడర్గా తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.