కాంగ్రెస్ దెబ్బ: మళ్లీ కెసిఆర్ ఫాంహౌస్ స్కెచ్చులు
మూడు నెలల క్రితం దసరా పండుగలోగా తెలంగాణ వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు అలా అని సంకేతాలు ఉన్నాయన్నారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం తెలంగాణపై ఇప్పట్లో తేల్చలేమని ఇటీవల కాలంలో పలుమార్లు చెప్పడంతో కెసిఆర్ చిక్కుల్లో పడ్డారు. దీంతో అతను ఇప్పుడు కాంగ్రెసు పార్టీకి మరోసారి ఉద్యమ వేడిని తగిలించాలని చూస్తున్నారట. అందుకోసం ఆయన పలువురు నేతలను, తెలంగాణవాదులను తన ఫాంహౌస్లో కలుస్తూ వ్యూహరచనలు చేస్తున్నారట.
సొంత పార్టీ నేతలు మాత్రమే కాకుండా తనకు అనుకూలంగా ఉన్న పలువురు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఇతరులతోనూ ఆయన జోరుగా సుదీర్ఘ చర్చలు కొనసాగిస్తున్నారట. ఢిల్లీ నుండి వచ్చాక కెసిఆర్ మాట్లాడుతూ.. అంతా బాగానే జరిగిందని చెప్పారు. కానీ కేంద్రమంత్రులు తెలంగాణపై ఆలోచించడం లేదని చెప్పడంతో ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. అందుకే ఇక కాంగ్రెసు పైన ఉద్యమకార్యాచరణ రూపొందించాల్సిందేనని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.